సీఐల సంతకాలు ఫోర్జరీ

31 Jul, 2020 12:46 IST|Sakshi

వేతనం కోసం కక్కుర్తి

భార్యాభర్తలిద్దరూ కానిస్టేబుళ్లే

మంచిర్యాలక్రైం: భార్యాభర్తలిద్దరూ పోలీస్‌ కానిస్టేబుల్లే... భార్యకు ఆరోగ్యం బాగాలేక సిక్‌లీవ్‌ పెట్టి ఏకాధాటిగా 19 నెలలు విధులకు హాజరు కాలేదు. దీంతో ఆమెకు వేతనం రాకపోవడంతో సదరు కానిస్టేబుల్‌ భర్త వక్ర బుద్దికి తెరలేపాడు. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి 19నెలల వేతనం కాజేసేందుకు ప్రయత్నించిన సంఘటన పోలీస్‌శాఖలో చర్చనీయాంశమైంది. 

అసలు ఏం జరిగింది....
మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఐడీ పార్టీ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జయచందర్‌తో పాటు ఆయన భార్య వనిత స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. 2018 ఆగస్టు 18న అనారోగ్యంతో సిక్‌లీవ్‌ పెట్టింది. అప్పటి నుంచి పోలీస్‌స్టేషన్‌కు రాకుండా దూరంగా ఉంది. 19 నెలల అనంతరం ఈ ఏడాది మార్చి 8న డ్యూటిలో చేరింది. సీఐ వెంకటేశ్వర్లు ఆమెను సిక్‌లీవ్‌ పాస్‌పోర్టులు అడగడంతో సమాధానం చెప్పలేదు. దీంతో వనిత సిక్‌లీవ్‌ ప్రోసీజర్‌ ఫాలో కాలేదని రామగుండం పోలీస్‌ కమిషనర్‌కు రిపోర్ట్‌ చేశాడు. 

ఇద్దరు సీఐల సంతకాలు ఫోర్జరీ..
19 నెలల వేతనం కాజేసేందుకు వనిత భర్త కానిస్టేబుల్‌ జయంచందర్‌ సిక్‌లీవ్‌ పాస్‌పోర్ట్‌లపై గతంలో పనిచేసిన సీఐ చంద్రమౌళి, ప్రస్తుతం పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర్లు సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేశాడు. సీఐ వెంకటేశ్వర్లు క్లియరెన్స్‌ లెటర్‌ ఇచ్చినట్లు, కవరింగ్‌ లెటర్‌తో çస్టాంపింగ్‌ చేసి మరీ రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో వేతనం కోసం ధరఖాస్తు చేశాడు. 

బయటకు తెలిసిందిలా..
సీఐ వెంకటేశ్వర్లు వనిత సిక్‌లీవ్‌ ప్రొసిజర్‌ ఫాలో కాలేదని కమిషనర్‌కు రిపోర్టు చేసిన క్రమంలో విచారణ ముందుకు సాగలేదు. అయితే ఇదే విషయమై మరోసారి అడ్మినిస్ట్రేటివ్‌ అధికారికి సీఐ గుర్తు చేశాడు. అప్పుడు ఫోర్జరీ చేసిన విషయం వెలుగుచూసింది. ఈ మేరకు జయచందర్, వనితపై చీటింగ్‌ కేసుతో పాటు మరో మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది. రామగుండం సీపీ సత్యనారాయణను వివరణ కోరగా ఇద్దరు సీఐల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తేలింది. కేసు నమోదు చేశాం. పూర్తి విచారణ అడిషనల్‌ డీసీపీ అశోక్‌కుమార్‌కు అప్పగించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు