అఖిల‌ప్రియకు బెయిల్‌ ఇవ్వొద్దు..

8 Jan, 2021 19:14 IST|Sakshi

అఖిలప్రియ కస్టడీ కోసం పోలీసులు పిటిషన్

సాక్షి, హైదరాబాద్‌: కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ కస్టడీ కోసం బోయిన్‌పల్లి పోలీసులు సికింద్రాబాద్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అఖిలప్రియను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. రేపటి నుంచి ఈనెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని, అఖిలప్రియ భర్త సహా మిగతా నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్‌ చేశాక కిడ్నాప్‌ సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయాల్సి ఉందన్నారు. (చదవండి: కిడ్నాప్‌ ప్లానంతా అతని కనుసన్నల్లోనే..

ఇది ఇలా ఉండగా, అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పోలీసుల కౌంటర్‌ దాఖలు చేశారు. అఖిలప్రియకు బెయిల్‌ వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, ఆమెపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం మాకు లేదని పోలీసులు తెలిపారు. ‘‘సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాలి. అఖిలప్రియకు బెయిల్‌ ఇస్తే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చు. అఖిలప్రియ చర్యల వల్ల స్థానికుల్లో అభద్రతాభావం నెలకొంది. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉంది. అఖిలప్రియకు బెయిల్‌ ఇస్తే కేసు విచారణ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. కాగా.. అఖిలప్రియ కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. (చదవండి: అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!)

మరిన్ని వార్తలు