రూ. 7కోట్లకు పైగా నకిలీ నోట్ల పట్టివేత

3 Mar, 2021 09:26 IST|Sakshi
పట్టుబడిన నకిలీ నోట్లు

ఛత్తీస్‌గఢ్‌ నుంచి విశాఖ తరలింపు

తనిఖీల్లో పట్టుబడిన రూ.7 కోట్లకు పైగా నగదు

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

సాక్షి, కొరాపుట్‌: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ) సుంకి చెక్‌ పోస్టు వద్ద  పొట్టంగి పోలీసులు సోమవారం సాయంత్రం భారీగా నకిలీ నోట్లను పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై సునాబెడ ఎస్డీపీఓ నిరంజన్‌ బెహచరా పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించి పోలీసులు పట్టుకున్న నకిలీ నోట్లతో పాటు నిందితులను  ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. పొట్టంగి ఎస్సై ఎస్‌.కె.స్వంయి, ఏఎస్సై ఎమ్‌.ఎస్‌.నాయక్‌లు వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఒక ఫోర్డు ఫిగో కారు రావడంతో ఆపి తనిఖీ చేయగా నకిలీ రూ. 500 నోట్లు ఆ కారులో సంచుల కొద్దీ కనబడ్డాయి.

కారులో ఉన్న ముగ్గురు నిందితులు, నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జంగిర్‌చంపా జిల్లాకు చెందిన నిందితులు రాజధాని రాయిపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న వారి సహచరులకు నకిలీ నోట్లు చేరవేసేందుకు వెళ్తున్నారు. మెజిస్ట్రేట్‌ సమక్షంలో నకిలీ నోట్లను లెక్కపెట్టగా రూ.7,90,00,000  ఉన్నాయని, నేరస్తులను అరెస్టు చేయడంతో పాటు వారి దగ్గర గల రూ.35 వేల నగదు, 5 మొబైల్‌ ఫోన్లు, క్రెడిట్, డెబిట్, ఐడీ కార్డులు  స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్డీపీఓ నిరంజన్‌ బెహరా వివరించారు.   

మరిన్ని వార్తలు