ఆడి కారు యాక్సిడెంట్‌: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది? 

2 Sep, 2021 06:52 IST|Sakshi
విషాదానికి గుర్తుగా మిగిలిన ఆడి కారు- కరుణాసాగర్‌ (ఫైల్‌)

ఆడి కారు దుర్ఘటనపై పోలీసుల ముమ్మర దర్యాప్తు

సీసీ కెమెరాల చిత్రాల జల్లెడ

కాల్‌డేటా పరిశీలన

పోస్టుమార్టం నివేదికల కోసం నిరీక్షణ 

బనశంకరి(కర్ణాటక): ఐటీ సిటీలో ఆడి కారు దుర్ఘటనలో ఎమ్మెల్యే తనయుడు, మరో ఆరుగురు యువతీ యువకుల మరణం సంచలనాత్మకమైంది. హై ఎండ్‌ కారుతో యువత సరదాలు కుటుంబాలకు శోకాన్ని మిగిల్చాయి. ఈ కేసులో కొత్త కొత్త అంశాలు నెమ్మదిగా వెలుగుచూస్తున్నాయి. కరుణాసాగర్, అతని స్నేహితులు మిడ్‌ నైట్‌ పార్టీ చేసుకుని జాలీ రైడ్‌ చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

150 కిలోమీటర్ల వేగం 
బెంగళూరు రోడ్ల మీద 90–100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం కష్టం. ప్రమాద సమయంలో 150 కిలోమీటర్లు కంటే ఎక్కువ వేగంతో కారు డ్రైవింగ్‌ చేశారంటే మత్తులో ఉండి ఉండాలని పోలీసులకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్, కోరమంగల, ఎంజీ రోడ్డు, ఇందిరానగర హోటల్స్, పబ్‌లను పరిశీలించాలని నిర్ణయించారు. కరుణాసాగర్‌ మిత్రబృందం ఎక్కడెక్కడ తిరిగిందో పసిగట్టేందుకు అక్కడి సీసీ కెమెరాల చిత్రాలను తనిఖీ చేయనున్నారు. యాక్సిడెంట్‌ జరిగినచోట రోడ్డు కుడివైపునకు వంపు ఉండగా, కారు ఎడమవైపునకు నేరుగా దూసుకుపోయింది. అక్కడ కారును అదుపు చేయలేకపోయారు.

3 మొబైళ్లు లభ్యం 
కారు శిథిలాల్లో మూడు మొబైల్‌పోన్లు లభించాయి. అన్ని ఫోన్ల తెరలు ముక్కలై ఉన్నాయి. వారి కాల్‌ డేటా, టవర్‌ లొకేషన్‌ ఆధారంగా ఎక్కడ విందు చేసుకున్నారో కూపీ లాగుతున్నారు. సుమారు 30 మంది పోలీసులను ఇందుకు నియమించారు. మద్యం సేవించారా, లేదా అనేది కచ్చితంగా తెలుసుకునేందుకు మృతుల రక్తనమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఒకటిరెండురోజుల్లో పరీక్షల నివేదిక అందే అవకాశం ఉంది. 

కారు నడిపిన కరుణాసాగర్‌ పోస్టుమార్టం నివేదిక కేసులో ముఖ్యమైనదని పోలీసులు తెలిపారు. అత్యంత వేగంగా డ్రైవింగ్‌ చేశారని కనబడుతున్నప్పటికీ  అందుకు కారణాలేమిటీ అనేది ఈ నివేదికల ద్వారా తెలిసే అవకాశముంది. కరుణాసాగర్‌ ఎమ్మెల్యే పుత్రుడు కావడంతో ఇది ప్రాముఖ్యమైన కేసుగా మారింది. ప్రమాదస్థలికి ముందు సోనీ వరల్డ్‌ సిగ్నల్‌ వద్ద ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఈ ఆడి కారునుంచి తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది. దీనిని గమనించిన పోలీసులు కారును అడ్డగించడానికి వెళ్లగా వేగంగా వెళ్లిపోయిందని సమాచారం.

మద్యం కొనుగోళ్లు?  
కారులోనివారు మద్యం సేవించి ఉంటారన్న పోలీసుల అనుమానానికి సాక్ష్యాలు లభిస్తున్నాయి. నైట్‌ కర్ఫ్యూ ప్రారంభానికి ముందు ఇషితా, మరొక యువతి కోరమంగలలో ఓ వైన్‌షాపులో మద్యం కొనుగోలు చేశారు. సీసాలను బ్యాగ్‌లో పెట్టుకుని బయలుదేరిన దృశ్యాలు సీసీ కెమెరాలో  నిక్షిప్తమయ్యాయి.  

సోమవారం రాత్రి 8.19 నిమిషాలకు కోరమంగలలో ఉన్న జోలో పీజీ నుంచి ఇషితా, బిందు బయలుదేరారు. 8.39 నిమిషాలకు పీజీ నుంచి సోనీ వరల్డ్‌కు వెళ్లే రోడ్డుకు చేరారు. పీజీ నుంచి సుమారు 200 మీటర్ల దూరం వరకు నడుచుకుని వెళ్లిన దశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

5 వ క్రాస్‌ రోడ్డు నుంచి ఎడమవైపునకు తిరిగి అక్కడ నుంచి  హైఫై  మద్యం దుకాణం వద్దకు వెళ్లారు. రాత్రి.8.30 నుంచి 8.44 వరకు మద్యం దుకాణంలో  కొనుగోలు చేశారు.  

అక్కడే పక్కనున్న పబ్‌లోకి వెళ్లగా మరమ్మత్తులు చేస్తుండటంతో వెనక్కి వచ్చేశారు. ఇషికా, బిందు అక్కడి నుంచి సోనీ వరల్డ్‌ మార్గంగా బయలుదేరారు. దుకాణాల వద్ద గల సీసీ టీవీలో దృశ్యాలు నమోదు కాబడ్డాయి. అక్కడికి ఆడి కారు రాగా, కారులో వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:
పబ్‌లో చిన్నారి డాన్స్‌ వైరల్‌.. పోలీసులు సీరియస్‌ 
చార్జింగ్‌కు పెట్టి ఫోన్‌లో మాట్లాడిన యువతి, అక్కడికక్కడే..

మరిన్ని వార్తలు