‘ఎమ్మెల్యేల​కు ఎర’ కేసు: వేర్వేరు గదుల్లో ఒకే ప్రశ్న ముగ్గురికి.. కీలక స్టేట్‌మెంట్‌?

10 Nov, 2022 17:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీస్‌ కస్టడీలో ఉన్న నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజిలను రాజేంద్రనగర్ సీఎస్‌లో పోలీసులు విచారించారు. తొలి రోజు విచారణలో సుమారు 7 గంటల పాటు నిందితులను ప్రశ్నించారు. ముగ్గురు నిందితులను వేర్వేరు గదుల్లో విచారించారు. ఒకే ప్రశ్నను ముగ్గురికి వేసి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

కొన్ని ప్రశ్నలకు ముగ్గురూ వేర్వేరు సమాధానాలు చెప్పినట్టు గుర్తించారు. కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్న రామచంద్రభారతి.. మరికొన్ని ప్రశ్నలను దాటవేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు రాలేదని రామచంద్రభారతి చెప్పినట్లు తెలిసింది. రేపు(శుక్రవారం) మరోసారి నిందితులను పోలీసులు ప్రశ్నించనున్నారు. రామచంద్రభారతి కేంద్రంగా విచారణ కొనసాగింది. ఆయన ముందు సాక్ష్యాధారాలు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. అతని గత చరిత్ర గురించి ఆరా తీశారు.

ఢిల్లీ, హర్యానాలో స్వచ్ఛంద సంస్థల పేరుతో కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పూజల పేరుతో పలువురి నేతలకు దగ్గరైనట్టు తేలింది. రామచంద్రభారతి స్టేట్‌మెంట్‌ కీలకం కానుంది. మహారాష్ట్ర, గోవా ప్రభుత్వాలను కూల్చినట్టు ఆడియో టేప్‌లో రామచంద్రభారతి చెప్పారు. ఢిల్లీలోనూ త్వరలో ప్రభుత్వం కూలుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, రామచంద్రభారతి పరిచయాల గురించి పోలీసులు ఆరా తీశారు.
చదవండి: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మరిన్ని వార్తలు