ఈ పోలీసులు పరువు తీస్తున్నారు!

6 Jun, 2021 10:15 IST|Sakshi
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌

సాక్షి, హైదరాబాద్‌/ జవహర్‌నగర్‌ : నిఘా కెమెరాల సంఖ్యలో దేశంలోనే ప్రథమ స్థానం... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం...రికార్డు స్థాయి రెస్పాన్స్‌ టైమ్‌... పోలీసు విభాగం ఓ పక్క ఇలా ప్రగతి పంథాలో దూసుకుపోతుంటే... కొందరు సిబ్బంది మాత్రం డిపార్ట్‌మెంట్‌ పరువును తీసేస్తున్నారు. అవినీతి ఆరోపణలు, సివిల్‌ వివాదాలను దాటి అసాంఘిక కార్యకలాపాలు, వేధింపుల వరకు వెళ్తున్నారు.

మొన్నటికి మొన్న హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని లాలాగూడ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డిపై వేటు పడగా.. తాజాగా జవహర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ సబ్‌– ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌ను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

అప్పట్లో అవినీతి.. ఆపై భూ వివాదాలు... 

  • ఒకప్పుడు పోలీసుల పేరు చెప్పగానే అవి నీతి కార్యకలాపాలు గుర్తుకు వచ్చేవి. నెల వారీ మామూళ్లు, కేసుల్లో కాసుల దందాలతో అడ్డగోలుగా రెచ్చిపోయే వారు.  
  • రాజధానిలో రియ ల్‌ బూమ్‌ పెరిగిన తర్వాత వీరి ఫోకస్‌ మామూళ్ల వసూలుతో పాటు రియ ల్‌ దందాలపై పడింది.  
  • భూ వివాదాల్లో తలదూర్చడం, కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగడంతో పాటు కొన్ని సందర్భాల్లో పోలీసులే వివాదాలను సృష్టించి లాభపడ్డారు. 2014 వరకు ఈ వ్యవహారాలు జోరుగా సాగాయి.

ఇప్పుడు పరిస్థితి మరీ ఘోరం... 

  • ఇవన్నీ ఒక ఎత్తయితే తాజాగా వెలుగులోకి వస్తున్న అంశాలు పోలీసు విభాగంపై చెరగని మచ్చలు తెస్తున్నాయి.  
  • మహిళల్ని వేధించిన ఇన్‌స్పెక్టర్‌ ఒకరైతే... భార్యతో విభేదాలతో మరొకరు రచ్చకెక్కారు.  
  • తాజాగా తమ దగ్గర పని చేసే మహిళా కానిస్టేబుళ్ల పైనే కన్నేసి రచ్చకెక్కుతున్నారు. తాజా బ్యాచ్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌ను వేధించిన లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌ ఓ రకంగా పరువు తీశాడు.  
  • జవహర్‌నగర్‌ ఎస్‌ఐ అనిల్‌ అయితే మరో అడుగు ముందుకు వేసి ఓ మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి, లోబర్చుకున్నాడు. ఆమెతో కలిసి కీసర పరిధిలోని ఓ రిసార్టులో రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.  
  • ఈ ఉదంతాలు పోలీసు విభాగంపై నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి.

చదవండి: రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి

మరిన్ని వార్తలు