యువతి కిడ్నాప్‌ కేసు సుఖాంతం 

4 Nov, 2020 10:23 IST|Sakshi
యువతిని కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్ భగీరథ ను విచారిస్తున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి

సాక్షి, అనంతపురం : కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. నగరంలోని ఆజాద్‌నగర్‌లో ఈ నెల రెండో తేదీన కిడ్నాప్‌కు గురైన జ్యోతి, కానిస్టేబుల్‌ భగీరథ ఆచారి తదితరులను బనగానిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెల్పిన వివరాల మేరకు... అనంతపురంలోని ఆరో రోడ్డుకు చెందిన గోపీనాథ్‌ ఆచారి కూతురు జ్యోతికి గతేడాడి అక్టోబర్‌లో కర్నూలు జిల్లా కొలిమిగుండ్లకు చెందిన భగీరథ ఆచారి (కానిస్టేబుల్‌)తో నిశ్చితార్థం కాగా, అదే ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి రద్దయ్యింది. చదవండి: 'ప్రతీది వక్రీకరించటం చంద్రబాబుకు అలవాటే'

ఈ నెల 2న సాయంత్రం జ్యోతి, తన బంధువు(మహిళ)తో కలసి ఆజాద్‌నగర్‌లోని టైలర్‌ షాప్‌కు వెళ్లింది. అక్కడ కొందరు స్కార్పియో వాహనంలో వచ్చి జ్యోతిని తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ సత్యయేసుబాబు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తక్షణమే అప్రమత్తమై సీఐ కత్తి శ్రీనివాసులు తదితరులతో పాటు పలు బృందాలను రంగంలోకి దింపారు. ఈ నెల 2న తాడిపత్రి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండడాన్ని గమనించిన భగీరథ ఆచారి తదితరులు స్కార్పియో వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లి, మరో జిస్ట్‌ వాహనంలో వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి అవుకు, తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. మంగళవారం కోవెలకుంట్ల మార్గంలో కానిస్టేబుల్‌ భగీరథ ఆచారి, జ్యోతిలను బనగానిపల్లి సీఐ అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి స్టేట్‌మెంట్‌ ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు.   

2వేల మంది బాలల గుర్తింపు 
అనంతపురం క్రైం: ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో భాగంగా గడిచిన నాలుగు రోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రెండు వేల మంది బాలలను గుర్తించినట్లు జిల్లా పోలీసు శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అందులో 1,674 మంది బాలురు, 326 మంది బాలికలు ఉన్నారు.

మరిన్ని వార్తలు