అతనో పోలీస్‌.. ఆమె ఇళ్లు మారినా వదల్లేదు..

18 Jul, 2021 16:58 IST|Sakshi

చెన్నై : తనను పట్టించుకోవటం లేదన్న కోపంతో మహిళపై దాడి చేశాడో పోలీసు. అంతటితో ఆగకుండా ఆమె స్కూటీని తగులబెట్టేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోయంబత్తూరుకు చెందిన కే పార్తిబన్‌ అక్కడి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. భర్తతో విడిపోయి కొడుకుతో కలిసి ఉంటున్న ఓ మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. కొన్ని నెలలు బాగానే ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ, సదరు మహిళ అతడ్ని దూరం పెడుతూ వచ్చింది.

అతడికి చెప్పకుండా పాత ఇంటినుంచి కొత్త ఇంటికి మారింది. అయితే, ఆమె ఎక్కడ ఉందో కనిపెట్టిన పార్తిబన్‌ గురువారం పోలీస్‌ డ్రెస్‌లో అక్కడకు వెళ్లాడు. ఆమెపై దాడి చేసి, బూతులు తిట్టాడు. శుక్రవారం ఉదయం ఆమె స్కూటీని తగులబెట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు