ఇద్దరితో వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్‌ ట్విస్ట్‌.. 10 నెలలు తర్వాత వీడిన మిస్టరీ

10 Sep, 2022 13:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బాపట్ల టౌన్‌: దంపతుల హత్య కేసు మిస్టరీని పది నెలల అనంతరం పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడు గ్రామానికి చెందిన హనుమంతరావు, రామతులశమ్మ దంపతులు. వీరి కుమార్తె అనితకు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన సాంబశివరావుతో వివాహమైంది. పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన కూచిపూడి రాజ్‌కుమార్‌తో అనిత వివాహేతర సంబంధం పెట్టుకుంది.
చదవండి: ఆర్‌ఎంపీతో వివాహం.. పక్కింటి యువకుడితో వివాహేతర సంబంధం..

ఆయనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరో వ్యక్తితో అన్యోన్యంగా ఉండటం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన ప్రియుడు ఆమెను నిలదీశాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె తన స్వగ్రామం పూసపాడు వెళ్లింది. రాజ్‌కుమార్‌ కూడా ఆ గ్రామానికి వెళ్లాడు. అక్కడ అనిత తల్లి రామతులశమ్మ నిందితుడితో గొడవపడింది. ఆమె కూడా అనితను సపోర్ట్‌ చేస్తున్నట్లు అనుమానించాడు.

తనకు అనిత దూరం కావడానికి వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటానికి రామతులశమ్మ కారణమని కక్షపెంచుకున్నాడు. ఆమెను చంపితే అనిత తనకు దక్కుతుందని భావించి హత్యకు పథకం పన్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కంచర్ల ప్రవీణ్‌కుమార్‌ అలియాస్‌ ప్రవీణ్, అలియాస్‌ కుమార్‌తో చర్చించాడు. ఇరువురు మద్యం తాగి 2021 నవంబర్‌ 19న అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై పూసపాడు చేరుకున్నారు. కొబ్బరిబొండాలు నరికే కత్తి వెంట తీసుకెళ్లారు. రామతులశమ్మతోపాటు ఆమె భర్త హనుమంతరావు కూడా పక్కనే ఉన్నాడు.

ఒకరిని చంపితే మరొకరు కేకలు వేస్తారని భావించి ఇరువురిని కత్తితో నరికి హత్య చేశారు. మృతురాలి చెవికి బంగారు కమ్మలు ఉండటంతో కత్తితో చెవులు కోసి వాటిని తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పది నెలల తర్వాత శుక్రవారం పొన్నూరు వద్ద నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.  

పోలీసులకు నగదు ప్రోత్సాహకం 
దంపతుల హత్య కేసు మిస్టరీను ఛేదించిన పోలీసులను శుక్రవారం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రశంసలు పొందిన వారిలో చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్, ఇంకొల్లు స్టేషన్‌ సీఐ డి.రంగనాథ్, ఎస్‌ఐ నాయబ్‌రసూల్,  హెడ్‌కానిస్టేబుల్‌ జి.పూర్ణచంద్రరావు, కానిస్టేబుళ్లు బి.బాలచంద్ర, కె.హరిచంద్రనాయక్, చినగంజాం కానిస్టేబుళ్లు డి.శ్రీనివాసరావు, కె.అనిల్‌కుమార్, ఉమెన్‌ పీసీ జి.సంధ్యారాణి, హోంగార్డు ఎం.ప్రభాకరరావు ఉన్నారు.   

మరిన్ని వార్తలు