వికారాబాద్‌ పదో తరగతి విద్యార్థిని హత్యాచారం కేసు.. ఏం జరిగిందో వివరించిన పోలీసులు

30 Mar, 2022 11:26 IST|Sakshi
ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

సాక్షి, వికారాబాద్‌: వికారాబాద్‌ పదో తరగతి విద్యార్థిని అత్యాచారం, హత్య కేసును పోలీసులు చేధించారు. హత్య చేసింది ప్రియుడు మహేందరేనని పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులో అత్యాచారానికి ఒడిగట్టినట్లు, ఆపై హత్యకు పాల్పడినట్లు తేల్చారు. ఈ మేరకు విద్యార్థిని హత్యాచారం ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. 

‘వికారాబాద్‌ జిల్లా పూడూర్‌ మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన పదిహేనేళ్ల విద్యార్థినితో.. నిందితుడు మహేందర్‌కు ఏడాదిగా పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే ఇద్దరు కలుసుకోవాలని ప్లాన్‌ వేసుకున్నారు. ఇద్దరూ సోమవారం ఉదయం బయట కలుసుకున్న క్రమంలో.. శారీరకంగా కలవాలని బాధితురాలిపై మహేందర్‌ ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ పెనుగులాటలో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి.

ఆమెను బలంగా నెట్టడంతో పక్కనే ఉన్న చెట్టుకు తల తగిలి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై శరీరంలో చలనం లేకపోవడంతో విషయం బయటపడుతుందని గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత తనకేమీ తెలియనట్లు ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఈ కేసులో క్లూస్‌ టీం, పోలీసుల విచారణ, డాక్టర్ల ఒపీనియన్‌ ఆధారంగా ఘటన జరిగిన 48 గంటల్లోనే కేసును చేధించాం. విచారణను పూర్తి చేసి నిందితుడిని బుధవారం సాయంత్రం కోర్టులో ప్రవేశ పెడతాం’ అని వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. 
చదవండి: ప్రేమ వివాహం.. భార్యను బతికుండగానే పూడ్చిపెట్టాడు

మరిన్ని వార్తలు