మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

21 Dec, 2020 08:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇళ్లలో పని చేసుకునే మైనర్‌ బాలిక(14)పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విచారకర అంశం ఏంటంటే ప్రధాన నిందితుడు మైనర్‌. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్‌ కైలాష్‌ 1 ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు పని చేసే చోట నిందితుడు(17) ఆమెకు పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో ఓ నెల క్రితం నిందితుడు.. అక్కడ పని మానేసి తను కొత్తగా మారిన చోట పనిలో జాయిన్‌ కావాలని ఆమెని కోరాడు. నిందితుడి మాటలు నమ్మిన బాధితురాలు శనివారం అతడి నివాసానికి వెళ్లింది. ఆ సమయంలో నిందితుడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్నారు. వారంతా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రధాన నిందితుడు ఒక్కడు మైనర్‌ కాగా మిగతా ముగ్గురు 18, 20, 30 ఏళ్ల వ్యక్తులు. (చదవండి: మృగాడి నుంచి కాపాడినందుకు 15 ఏళ్లు శిక్ష)

ఇక ఈ దారుణం గురించి ఆదివారం పోలీసులకు సమచారం అందడంతో కేసు నమోదు చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇక రెండు నెలల క్రితం ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఏడాది అత్యాచార కేసులు 28 శాతం తగ్గాయని వెల్లడించారు. సెప్టెంబర్‌ 30, 2020 నాటికి 1,241 అత్యాచార కేసులు నమోదు కాగా గతేడాది ఇవి 1,723గా ఉన్నాయి అని తెలిపారు. 

మరిన్ని వార్తలు