సిగరెట్, బాయ్‌ఫ్రెండ్‌ వద్దన్నందుకు..

17 Nov, 2020 18:54 IST|Sakshi

సహజీవనం చేస్తున్న యువతి నయవంచన చేసిందని అఘాయిత్యం

అనంతపురం క్రైం: కెనాడాలో ‘అనంత’ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. సహజీవనం చేస్తోన్న యువతి తనను నయవంచన చేయడంతో తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే... నార్పల మండలం గడ్డంనాగేపల్లికి చెందిన పి.నారాయణస్వామి, పి.వాణి దంపతులు అనంతపురంలోని కోవూరునగర్‌లో నివాసముంటున్నారు. వీరి కుమారుడు పుచ్చకాయల ప్రణయ్‌ (29) కెనాడలోని విక్టోరియాలో డిజిటల్‌ విభాగంలో పని చేస్తున్నాడు. కృష్ణా జిల్లా ఘంటసాల ప్రాంతానికి చెందిన దేవిప్రసాద్‌ ముప్పాల, వాణి ముప్పాల దంపతుల కూతురు సాయి అఖిల ముప్పాల. వీరు హైదరాబాద్‌ హఫ్సీగూడలో నివాసముంటున్నారు. ఈ ఏడాది జనవరిలో అఖిల ముప్పాలతో ప్రణయ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా, ఆ తర్వాత డేటింగ్‌ (సహజీవనం) వరకు వెళ్లింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కెనాడాలో మ్యారేజ్‌ లైసెన్స్‌ తీసుకుని ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబర్‌ 7 వరకు విక్టోరియాలోని అవేబరీ అవే ప్రాంతంలో సహజీవనం చేశారు. యూఎస్‌లో హెచ్‌1 వీసా రాగానే అఖిల ముప్పాల ప్రణయ్‌ను నయవంచన చేసి వెళ్లిపోయింది.

మరికొందరితో ప్రేమాయణం 
అఖిల హైదరాబాద్‌ మల్లారెడ్డి కళాశాలలో ఫార్మసీ పూర్తి చేసి 2013–14లో యూఎస్‌కు వెళ్లింది. 2018లో అనిరుధ్‌ తెటాలి అనే వ్యక్తితో కలిసి ఒకటే చోట ఉంది. యూఎస్‌లో ఉన్నప్పుడు మహేష్‌, ఆశిక్, తదితరులతో కూడా అఖిలకు పరిచయం ఉంది. మూడేళ్లు గడిచినా హెచ్‌1 వీసా రాకపోవడంతో 2020 జనవరి ప్రారంభంలో ప్రణయ్‌ ఉంటున్న విక్టోరియాకు వచ్చింది.

సిగరెట్, బాయ్‌ఫ్రెండ్‌ వద్దన్నందుకు.. 
సిగరెట్‌ తాగితే ఆరోగ్యం చెడిపోతుందని, పాత బాయ్‌ఫ్రెండ్‌లతో చాట్‌ చేయకూడదని అఖిలపై ప్రణయ్‌ కోప్పడ్డాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ కలసిమెలసి ఉన్నారు. ఈ క్రమంలో హెచ్‌1 వీసా ప్రీమియం కన్ఫర్మేషన్‌ వచ్చింది. అదే ఛాన్స్‌గా తీసుకున్న అఖిల ఈ ఏడాది అక్టోబర్‌ 7న ప్రణయ్‌కు చెప్పకుండా వెళ్లిపోయింది. వీరిద్దరి సహజీవనం ఇరు కుటుంబాలకు తెలుసు. అఖిల చేసిన నయవంచనను తల్లి వాణి(అఖిల తల్లి)కి చెప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. చివరకు ప్రణయ్‌పై కేసు పెడతామని అఖిల తల్లి బెదిరించింది. ఈ క్రమంలో అఖిల, ఆమె తల్లి ప్రణయ్‌ ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేశారు.

14న ఆత్మహత్య..
అఖిల చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన ప్రణయ్‌ ఈ నెల 14న విక్టోరియాలో నైట్రోజన్‌ గ్యాస్‌ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు తన బాధను వ్యక్తం చేస్తూ వీడియో తీశాడు. ప్రణయ్‌ మరణవార్త తెలియగానే అనంతపురం నాల్గవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు కోవూర్‌నగర్‌లోని ఇంటికి వెళ్లి అతడి కుటుంబీకులతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు