10 నెలల క్రితమే పెళ్లి.. పెళ్లైన 2 నెలల నుంచే వేధింపులు.. గర్భిణి ఆత్మహత్య

17 Feb, 2022 11:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జహీరాబాద్‌: అత్తింటి వారి అదనపు కట్నం వేధింపులు తాళలేక  మూడు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం డీఎస్పీ శంకర్‌రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా కల్‌కోడె గ్రామానికి చెందిన మంజూల, బస్వరాజ్‌ దంపతుల కుమార్తె నిఖిత వివాహం పది నెలల క్రితం దామస్తపురం గ్రామానికి చెందిన సాయికుమార్‌తో జరిగింది. వివాహ సమయంలో రూ.2 లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి ఇచ్చారు. వివాహమైన రెండు నెలల తర్వాత భర్త సాయికుమార్, అత్త అనుసూజ, మామ యాదప్ప అదనపు కట్నం కోసం వేధించేవారు.

ఐదు నెలల క్రితం జహీరాబాద్‌లో కాపురం పెట్టారు. అయినా వరకట్న వేధింపులు ఆగలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన నిఖిత ఉరేసుకుంది. మృతురాలి తల్లి మంజూల ఫిర్యాదు మేరకు డీఎస్పీ, సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ శ్రీకాంత్, తహసీల్దార్‌ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి వచ్చి పంచనామ నిర్వహించారు. నిందితులు సాయికుమార్, అను సూజ, యాదప్పను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. మృతదేహాన్ని పోర్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

మరిన్ని వార్తలు