నాలుగు నెలల్లో రెట్టింపు నగదు.. లగ్జరీ కారు.. 60 కోట్ల మోసం.. 

25 Jun, 2021 08:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, టీ.నగర్‌(తమిళనాడు): డిపాజిటర్లకు నాలుగు నెలల్లో రెట్టింపు నగదు ఇస్తామని ఆశచూపి పలువురి వద్ద రూ.60 కోట్ల వరకు మోసగించిన ప్రైవేటు సంస్థపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మదురై కాలవాసల్‌ బెతేల్‌ నగర్‌లో ఒక ప్రైవేటు ట్రేడింగ్‌ సంస్థ పని చేస్తోంది. దాన్ని దిండుక్కల్‌కు చెందిన ఆనంది, మనోజ్‌కుమార్, మదురైకి చెందిన ఫారూక్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో నగదు పెట్టుబడులు పెడితే 120 రోజుల్లో రెట్టింపు అవుతుందని, అంతేకాకుండా లగ్జరీ కారు ఇస్తామని సోషల్‌ మీడియాలో ప్రకటన ఇచ్చారు.

దీన్ని నమ్మి వేలాదిమంది ఈ సంస్థలో రూ.2,500 నుంచి రూ.లక్షలు వరకు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. మొదట్లో కొంతమందికి రెట్టింపు నగదు ఇచ్చారు. తర్వాత ఇవ్వలేదు. అనుమానించిన డిపాజిటర్లు నిర్వాహకులను ఫోన్‌లో సంప్రదించగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో 48 మంది బుధవారం మదురై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వేలాదిమంది నుంచి రూ.60 కోట్ల మేరకు మోసగించినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి నగదు ఇప్పించాలని కోరారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

చదవండి: వివాహేతర సంబంధం: చేతులు, కాళ్లు కట్టేసి..

మరిన్ని వార్తలు