లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు 

6 May, 2022 23:12 IST|Sakshi
ప్రమాదానికి గురైన బస్సు (ఇన్‌సెట్‌)

ఒకరు మృతి ఐదుగురికి గాయాలు 

గోపవరం: మండలంలోని పి.పి.కుంట సమీపంలో నెల్లూరు– ముంబై (ఎన్‌హెచ్‌–67) జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది, ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బళ్లారి నుంచి నెల్లూరు వెళుతున్న పీఎస్‌ఆర్‌ ప్రైవేటు ట్రావెల్స్‌æ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సు ముందు భాగంలో ఉన్న రాజస్థాన్‌కు చెందిన సురేకుమార్‌(30) అనే వ్యక్తి అదుపు తప్పి కిందపడటంతో టైరు ఎక్కి అక్కడికక్కడే మృతి చెందాడు.

రాజస్థాన్‌కు చెందిన జగదీ‹Ù, మల్లికార్జున, వాకాడుకు చెందిన పద్మావతి, కుసుమ, అనంతపురానికి చెందిన విజయబాబులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు అతివేగంగా వెళుతుండటం, డ్రైవర్‌ నిద్రలోకి జారడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్‌ అక్కడి నుంచి పరారయ్యారు.  

మరో రెండు నిమిషాల్లో గమ్యం చేరేలోపే.. 
కాగా మృతి చెందిన సురేకుమార్‌ పి.పి.కుంట వద్ద గాలిమిషన్‌లో కూలీ పని చేసుకుంటున్నారు. ఇటీవల స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మరో రెండు నిమిషాల్లో పి.పి.కుంట స్టేజీ వద్ద దిగేందుకు పుట్‌బోర్డు మీదకు చేరుకున్న సురేకుమార్‌ ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో కిందపడి బస్సు టైరు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

బద్వేలు రూరల్‌ ఏఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని టైరు కింద ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటికి తీశారు. బస్సు ఢీకొన్న లారీ సిమెంట్‌ లోడుతో వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే లారీ మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది. సురేష్‌కుమార్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు