లైన్‌మెన్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ కేసు: ముగ్గురు అరెస్టు

23 Jul, 2022 07:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ శాఖ జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీకు కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హైదరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు ఒప్పందం చేసుకొని పలువురి అభ్యర్థుల నుంచి నిందితులు అడ్వాన్సుగా రూ. లక్ష వసూలు చేసినట్లు తెలిసింది. సరైన సమయానికి సమాధానాలు పంపించలేకపోవటంతో అభ్యర్థులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. 

బయటపడిందిలా.. 
ఈనెల 17న జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాల భర్తీకి పరీక్ష జరిగింది. ముందుగానే విద్యుత్‌శాఖలోని పలువురు ఉద్యోగులు అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 80 ప్రశ్నలకు సమాధానాలు పంపిస్తామనేది వాళ్ల ఒప్పందం. దీని ప్రకారం అభ్యర్థులు పరీక్షా హాల్‌కు సెల్‌ఫోన్‌ను తీసుకెళతారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మెసేజ్‌ రూపంలో అభ్యర్థులకు సమాధానాలు వస్తాయి.

మొదటి ఆన్సర్‌ ఏ అయితే 1 అని, బీ అయితే 2 అని అంకెల రూపంలో సమాధానాలు పంపిస్తారు. అయితే నిందితులు ఎక్కువ మంది అభ్యర్థులతో ఒప్పందం చేసుకోవటంతో ఒకేసారి అందరికీ సమాధానాలు పంపించలేకపోయారు. దీంతో బయటికి వచి్చన తర్వాత పలువురు అభ్యర్థులు మోసపోయామని గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

అంబర్‌పేటలో ముగ్గురి అరెస్ట్‌.. 
అంబర్‌పేట పోలీసులు శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేశారు. డిటెక్టెవ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ కథనం ప్రకారం... కాడ్తాల్‌కు చెందిన లోక్యా నాయక్‌ జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్ష కోసం సిద్దపడ్డాడు. ఇతనికి నగరంలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన అభ్యర్థి దశరథ్‌తో పరిచయం ఉంది. డబ్బులు ఖర్చుపెడితే  పరీక్షలో పాస్‌ అయ్యే మార్గం ఉందని దశరథ్‌ లోక్యానాయక్‌తో చెప్పాడు. దీనికి లోక్యా నాయక్‌ అంగీకరించాడు. దీంతో కర్మన్‌ఘాట్‌లో నివిసించే లైన్‌మెన్‌ శ్రీనివాస్‌ (42)ను సంప్రదించారు.

వీరంత కలిసి అంబర్‌పేటలో నివసించే మలక్‌పేట ఏడీఈ ఫిరోజ్‌ఖాన్‌(46)ను సంప్రదించారు. రూ.లక్ష ఇస్తే పరీక్షలో పాస్‌ అయ్యేలా చూస్తానని లోక్యానాయక్‌ వద్ద డబ్బులు తీసుకున్నారు. కాగా జూనియర్‌ లైన్‌ పరీక్షకు లోక్యానాయక్‌ హజరయ్యాడు. బయటకు వచ్చి మీరు నాకు ఏలాంటి సహాయం చేయలేదని, తిరిగి నా డబ్బులు ఇవ్వాలని కోరాడు. నీవు పరీక్షా సమయంలో మద్యలో ఎందుకు వచ్చావు... పూర్తి సమయంలో పరీక్షా కేంద్రంలో ఉంటే నీకు జవాబులు అందించే వాళ్లమని అతనికి చెప్పాడు. దీంతో లోక్యా నాయక్‌ విసుగుచెంది శుక్రవారం పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.  

సెల్‌ఫోన్‌తో పరీక్షకు హాజరు.. 
ప్రశ్నాపత్రం లీక్‌ విషయమై ఘట్‌కేసర్‌ పీఎస్‌లో కేసు నమోదయింది. ఘట్‌కేసర్‌లో నివాసం ఉండే కోదాడ ఈఏ సైదులును అరెస్ట్‌ చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్‌ మండలం, ఘనాపూర్‌ గ్రాలంలోని కేపీఆర్‌ఐటీలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షా హాల్‌లో అభ్యర్థి సీహెచ్‌ శివప్రసాద్‌ను తనిఖీ చేయగా లోదుస్తుల్లో సెల్‌ ఫోన్‌ లభించింది.

వెంటనే పరీక్షా నిర్వాహకులు సీఐ చంద్రబాబుకు సమాచారమివ్వగా, అభ్యరి్థని అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టి, నిజమేనని తేలడంతో కేసు నమోదు చేశారు. అలాగే సుల్తాన్‌ బజార్‌లో కొందరు అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి సెల్‌ ఫోన్‌లు తీసుకెళ్లి మైక్రోఫోన్‌ సహాయంతో సమాధానాలు చేరవేసుకున్నట్లు తెలిసింది.  

(చదవండి: టీఎంసీ మంత్రి సన్నిహితుల ఇంట్లో కుప్పలుకుప్పలుగా నోట్ల కట్టలు)

మరిన్ని వార్తలు