PSI Recruitment Scam: విచారణలో సంచలన నిజాలు

11 May, 2022 11:23 IST|Sakshi

బనశంకరి(బెంగళూరు): ఎస్‌ఐ రాత పరీక్ష స్కాంలో సీఐడీ దర్యాప్తులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పరీక్ష సమయంలో ఇచ్చిన ఓఎంఆర్‌ షీట్లు చోరీకి గురైనట్లు కనిపెట్టారు. అక్రమాలు జరిగిన పరీక్షా కేంద్రాల్లో ఇచ్చిన ఓఎంఆర్‌ షీట్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. వాటిని పరీక్షించగా, కార్బన్‌ షీట్, అసలైన ఓఎంఆర్‌ షీట్‌ మధ్య అనేక వ్యత్యాసాలు కనబడ్డాయి. సుమారు 92 కు పైగా సమాధానపత్రాల్లో అవకతవకలు బయటపడ్డాయి. పరీక్ష అయిపోయాక కొందరు అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌ను బయటకు తీసుకువచ్చినట్లు తేలింది.

వాటి స్థానంలో అక్రమార్కులు చక్కగా భర్తీచేసిన షీట్లను పెట్టి ఉంటారని అనుమానాలున్నాయి. ఓఎంఆర్‌ను నింపిన పెన్‌ ఇంక్‌లో కూడా వ్యత్యాసం ఉన్నట్లు తెలిసింది. అక్రమార్కులు నలుపు, నీలి రంగు ఇంక్‌ పెన్నులు మూడురకాల పెన్నులు  వినియోగించారు. 8 పేపర్లలో 4 రకాల రంగుల పెన్నులు వాడారు. పలు ఓంఎఆర్‌ షీట్లలో అభ్యర్థులవి కాకుండా ఇతరుల వేలిముద్రలు అనేకం కనిపించడం బట్టి బయటివారి పాత్ర బహిర్గతమైంది. కాగా, చెన్నరాయపట్టణ పురసభ మాజీ సభ్యుడు సీఎస్‌.శశిధర్‌ను సీఐడీ అరెస్టు చేసింది.   

మరో స్కాంలోనూ కింగ్‌పిన్‌ రుద్రేగౌడ   
ఎస్‌ఐ స్కాంలో సూత్రధారి రుద్రేగౌడ పాటిల్‌ గతంలో జరిగిన పీడబ్ల్యూడీ నియామకాల అక్రమాల్లో కూడా ముఖ్య పాత్ర వహించినట్లు సీఐడీ దర్యాప్తులో వెలుగుచూసింది. దీనిపై గత ఏడాది డిసెంబరు 14 తేదీన బెంగళూరు అన్నపూర్ణేశ్వరినగర పోలీస్‌స్టేషన్‌లో  కేసు నమోదైంది.

చదవండి: నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్‌ కొన్న సురేష్‌రెడ్డి!

మరిన్ని వార్తలు