మృగాళ్లకు బాలిక బలి: నిందితుల్లో మైనర్లు

12 May, 2021 11:29 IST|Sakshi

పీయూసీ విద్యార్థినిపై అత్యాచారం

తర్వాత బండరాళ్లతో కొట్టి హత్య

యాదగిరి జిల్లా హుణిసిగిలో ఘోరం

నిందితుల్లో ఇద్దరు మైనర్లు

రాయచూరు రూరల్‌: పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికపై కామాంధులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం కర్నాటకలోని యాదగిరి జిల్లా సురపుర తాలూకా హుణిసిగిలో ఆలస్యంగా వెలుగుచూసింది. హుణిసిగిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన బాలిక (16) అదే పట్టణంలో పీయూసీ చదువుతోంది. కరోనా నేపథ్యంలో కళాశాలకు సెలవు కావడంతో ఇంటివద్దనే ఉంటోంది.

ఈనెల 9వ తేదీ ఆదివారం  ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది. ఆ సమయంలో ముగ్గురు యువకులు బలవంతంగా పొలాల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. అయితే బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకుని గాలింపు చేపట్టగా పట్టణ సమీపంలోని పొలాల్లో బాలిక మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. కామాంధుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అదే పట్టణానికి చెందిన విజయ్‌కుమార్‌ (18) అరెస్ట్‌ చేశారు. అతడితోపాటు 16, 17 ఏళ్ల వయసున్న బాలురు అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అయితే వారిద్దరూ పరారీలో ఉన్నారు. వారిద్దరి కోసం గాలిస్తున్నట్లు సురపుర సీఐ శివయ్య హిరేమఠ్‌ తెలిపారు.

చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య
చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా

మరిన్ని వార్తలు