వివాహేతర సంబంధం..పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి కుమారుడ్ని దారుణంగా

24 Apr, 2023 20:16 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ వ్యక్తి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమారుడ్ని దారణంగా హత్య చేశాడు. చిన్నారి అని కూడా చూడకుండా వేడి వేడి నీళ్లున్న బకెట్‌లో బాలుడ్ని ముంచాడు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులు మృత్యుతో పోరాడి చనిపోయాడు.

నిందితుడి పేరు విక్రమ్ శరద్ కోలేకర్. ఖేడ్‌లో నివసిస్తున్నాడు. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళతో చాలా కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె కూడా ఖేడ్‌లోనే ఉంటోంది. అయితే ఏప్రిల్ 6న ఉదయం మహిళ ఇంటికెళ్లాడు విక్రమ్. పిల్లాడిని ఇతనికి అప్పగించి ఆమె బయటకు వెళ్లింది. ఈ సమయంలో చిన్నారిని వేడి నీటిలో ముంచాడు. ఇంటికొచ్చి చూసిన తల్లి కాలిన గాయాలున్న కుమారుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. 15 రోజులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

విక్రమ్ తనను పెళ్లి చేసుకోమని చాలా రోజులుగా అడుగుతున్నాడని, అందుకు తాను ఒప్పుకోలేదనే కోపంతోనే తన కుమారుడ్ని చంపాడని మహిళ ఆరోపించింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతనిపై కేసు పెట్టింది. దీంతో విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.
చదవండి: అతీక్ అహ్మద్‌ కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు..ఎవరిని హత్య చేశారు?

మరిన్ని వార్తలు