Putta Madhu: అత్యంత పకడ్బందీగా అజ్ఞాతం

9 May, 2021 11:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు.. తన ఆచూకీ పోలీసులకు చిక్కకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించాడు. నిన్నమొన్నటి వరకు ఎక్కడా సెల్‌ఫోన్‌ వాడలేదు, కుటుంబ సభ్యులు, అనుచరులను ఫోన్‌లో సంప్రదించలేదు. సొంత వాహనం వాడలేదు. హోటళ్లు, లాడ్జిలలో కాకుండా తెలిసిన వారి వద్దే తలదాచుకున్నాడు.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో తిరిగాడనే అనుమానాలున్నా, ఎక్కడా సొంత ఏటీఎం కార్డు కూడా వాడలేదంటే ఎంత పకడ్బందీగా వ్యవహరించాడో అర్థమవుతోంది. మధుకు ఆప్తుడైన కర్ణాటకకు చెందిన ఓ మిత్రుడికి ఏపీలోని రావులపాలెంలో ఉన్నవారితో సంబంధాలు ఉన్నాయని, ఆ పరిచయాల ఆధారంగా మధు భీమవరంలో ఆశ్రయం పొందినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి.

మధు ఆచూకీ కనిపెట్టాలని మధుకు దగ్గరగా ఉండే ఓ ఇన్‌స్పెక్టర్‌ను ఉన్నతాధికారులు ఆదేశించారని, ఆ అధికారి సూచనల మేరకు ఇటీవల కుటుంబ సభ్యులు మధును సంప్రదించగా.. ఆ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా భీమవరంలో అతని జాడను కనిపెట్టారని చెబుతున్నారు. 

సుపారీ టేపులపై రెండున్నరేళ్ల తర్వాత కేసు! 
వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితుల్లో ఒకరైన కుంట శ్రీను పేరుతో, 2018 ఎన్నికలకు ముందు మధు పేరును ప్రస్తావిస్తూ ఓ హత్యకు సంబంధించి జరిగిన సుపారీ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హత్యకు డీల్‌ రూ.60 లక్షలకు కుదిరింది.

రెండున్నరేళ్ల తర్వాత, వామన్‌రావు హత్య అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, ఇటీవల వాయిస్‌ టెస్టుకు అను మతి కోరుతూ మంథని కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఇన్ని రోజులు కుంటశ్రీను ఎవరితో సుపారీ మాట్లాడాడు? అసలు ఆ గొంతు ఎవరిది? అన్న విషయాన్ని తేల్చకపోవడం గమనార్హం.

చదవండి: లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’

మరిన్ని వార్తలు