ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. మిత్రుడికి తెలియకుండా..

10 Oct, 2020 09:46 IST|Sakshi
చికిత్స పొందుతున్న గోపీవర్మ 

సాక్షి, గుంటూరు : ప్రియురాలి వివాదం ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చురాజేసింది. అంతర్గత విభేదాలతో చివరకు స్నేహితుడి ప్రాణానికే ఆపద తలపెట్టేలా చేసింది. కూల్‌డ్రింక్‌లో గడ్డిమందు కలిపి ఇవ్వడంతో ప్రస్తుతం ఆ స్నేహితుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...యడ్లపాడుకు చెందిన దాట్ల గోపీవర్మ, మర్రిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్‌చంద్‌ స్నేహితులు. ప్రేమ్‌చంద్‌కు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. తన వద్ద ఫోన్‌ లేకపోవడంతో స్నేహితుడైన గోపీ ఫోన్ ‌ద్వారా తరచుగా మాట్లాడేవాడు.

అయితే మిత్రుడికి తెలియకుండా అదే నంబర్‌కు గోపీ కూడా పలుమార్లు మాట్లాడిన విషయాన్ని ప్రేమ్‌చంద్‌ గ్రహించాడు. దీంతో స్నేహితుల మధ్య పలుమార్లు వివాదాలు నెలకొన్నాయి. చివరిగా ఈనెల రెండోతేదీన ఇద్దరూ ఈ విషయమై గొడవ పడ్డారు. ప్రియురాలి విషయంలో అడ్డుగా ఉన్న గోపీవర్మను కడతేర్చాలని ప్రేమ్‌చంద్‌ నిశ్చయించుకున్నాడు.  (డేటింగ్‌ పేరుతో చీటింగ్‌)

అదేరోజు రాత్రి గోపీవర్మను యడ్లపాడు–నాదెండ్ల మార్గంలోని చప్టా వద్దకు పిలిపించి ముందుగానే గడ్డిమందు కలిపి ఉంచిన కూల్‌డ్రింక్‌ను అతనితో తాగించి తర్వాత నిజం చెప్పాడు. వెంటనే గోపీ బైక్‌పై ఇంటికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. గోపీ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో ఈనెల 7న గుంటూరు జీజీహెచ్‌కు తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. యడ్లపాడు ఎస్‌ఐ డి.శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు