మొత్తం దోచేస్తారు: అబ్బాయితో అమ్మాయిలా.. అమ్మాయితో..

8 Jan, 2021 15:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీమ్‌ గిఫ్ట్‌ పేరుతో ఫ్రాడ్‌ చేస్తున్న సైబర్‌ క్రైమ్‌ ముఠాను అరెస్ట్‌ చేసినట్ల రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఢిల్లీ నుంచి రాకెట్‌ నడిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రొఫైల్‌ తయారుచేసి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తారు. అబ్బాయితో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్‌ చేయడం మొదలుపెడతారు. ఇదే విధంగా హైదరాబాద్‌కు చెందిన అబ్బాయికి సోఫియా అనే అమ్మాయి పేరుతో రిక్వెస్ట్‌ వచ్చింది. అనంతరం మీ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాను అని మెసేజ్‌ చేసింది. తర్వాత ముంబై ఎయిర్‌పోర్ట్‌లతో ల్యాండ్‌ అయ్యాను. నా దగ్గర 75 వేల పౌండ్స్‌ క్యాష్‌, గోల్డ్‌ చైన్స్‌, మొబైల్‌ ఫోన్స్‌కు కస్టమ్స్‌ ట్యాక్స్‌ కట్టాలని బాధితుడితో డబ్బులు వేయించుకున్నారు. చదవండి: (భూ వివాదం: సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు‌)

ముఠా సభ్యులంతా ఢిల్లీలో ఒకే చోట కలిసి ఉంటూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశాము. నిందితులపై పీడీ యాక్ట్‌ కూడా నమోదు చేస్తాము. డింగ్‌ టోన్‌ యాప్‌ని ఉపయోగించి అమాయకులను మోసం చేస్తున్నారు. తమ అకౌంట్లో వేయించుకున్న నగదుతో ఢిల్లీలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. గుర్తు తెలియని వారి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయకూడదు. ఇలాంటి తరహా మోసాలే మ్యాట్రిమోని పేరుతో కూడా జరుగుతున్నాయి. జేమ్స్‌ బాండ్‌ లాగా ప్రొఫైల్‌ తయారు చేసి మోసం చేస్తున్నారు. రాచకొండ పరిధిలో ఏడుగురు వీరి చేతిలో మోసపోయినట్ల తెలుస్తోంది' అని మహేష్‌ భగవత్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు