రాజ్యసభ సీటు కావాలా? గవర్నర్‌ పదవి కావాలా? రూ.100 కోట్లివ్వు పని అయిపోద్ది..!

25 Jul, 2022 15:13 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: రూ.100 కోట్లిస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామని దందా నడుపుతున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. నిందితులకు ఓ వ్యక్తికి మధ్య డబ్బులు చేతులు మారడానికి క్షణాల ముందు వారిని పట్టుకుంది. రూ.100 కోట్లిస్తే గవర్నర్ పదవి కూడా ఇప్పిస్తామని నిందితులు ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

నాలుగు వారాలుగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి వెళ్తున్న కాల్స్‌పై నిఘా వహించిన అధికారులు ఎట్టకేలకు నలుగురు నిందితులను గుర్తించి పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన కర్మలాకర్‌  ప్రేమ్‌కుమార్ బండ్గార్‌, కర్ణాటకకు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్, అభిషేక్ బూరాగా గుర్తించారు అధికారులు. 

వీరంతా చాలా కాలంగా ఈ రాకెట్ నడుపుతున్నారు. డబ్బులిస్తే రాజ్యసభ సీటు, గవర్నర్ పదవితో పాటు ప్రభుత్వ సంస్థలకు ఛైర్మన్‌గా నియమిస్తామని నమ్మించి మోసానికి పాల్పడుతున్న తెలుస్తోంది. అంతేకాదు తాము సీబీఐ అధికారులమని చెప్పి పోలీసు శాఖలో అధికారులను కూడా బురిడీ కొట్టించి పనులు చేయించుకున్నట్లు సమాచారం. నిందితుడు ప్రేమ్‌కుమార్‌ తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయని చెప్పి అభిషేక్‌ బూరాతో కలిసి కుట్రలు చేసినట్లు సీబీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు.
చదవండి: కడుపులో బంగారం మాయం.. భార్య ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి!

మరిన్ని వార్తలు