రాహుల్ హత్య కేసు: A1 కోరాడ విజయ్‌‌, A2 కోగంటి సత్యం

21 Aug, 2021 16:32 IST|Sakshi

ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడలో సంచలనం రేపిన యువ వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్‌ 302, 120 B రెడ్‌ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. రాహుల్ తండ్రి కరణం రాఘవరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

 చదవండి:  రాహుల్ హత్య కేసులో కొత్త కోణం, ఇద్దరు మహిళల ప్రమేయం?

A1 కోరాడ విజయ్‌‌, A2 కోగంటి సత్యం, A3 విజయ్‌ భార్య పద్మజ A4 పద్మజ, A5 గాయత్రిగా ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు వెల్లడిం‍చారు. ఈ హత్య కేసులో నిందితుడైన కోరాడ విజయ్‌.. రాహుల్‌ వ్యాపార భాగస్వాములని పేర్కొన్నారు. 2016లో జి.కొండూరులో జిక్సన్ సిలిండర్‌ కంపెనీ ప్రారంభించినట్లు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి విజయ్ నష్టపోయాడని తెలిపారు. తన షేర్లు తీసుకుని డబ్బు ఇవ్వాలని రాహుల్‌పై విజయ్‌ ఒత్తిడి తెచ్చాడని, రాహుల్‌ వద్ద డబ్బు లేకపోవడంతో షేర్లు తీసుకోలేదని వివరించారు.

చదవండి: రూ.15 కోట్లు కోసం ఒత్తిడి.. పక్కా ప్రణాళికతో హత్య

అదేవిధంగా కోగంటి సత్యంకు కంపెనీ అమ్మాలని విజయ్ ఒత్తిడి తెచ్చాడని, అయితే కంపెనీ అమ్మేందుకు రాహుల్‌ అంగీకరించలేదని పేర్కొన్నారు. కోగంటి సత్యం, విజయ్‌, భార్య పద్మజ, గాయత్రి రాహుల్‌పై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. రాహుల్ ఇళ్లు విడిచి వెళ్లేటప్పుడు రెండు ఫోన్లు తీసుకెళ్లాడని తెలిపారు. 18వ తేదీన రాత్రి 7 గంటలకు రాహుల్ బయటకు వెళ్లాడని, అతను తిరిగి రాకపోవడంతో 19న తండ్రి  కరణం రాఘవరావు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా కోరాడ విజయ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు