బాలికపై లైంగికదాడికి యత్నం.. రైల్వే ఉద్యోగి అరెస్ట్‌!

9 Feb, 2022 20:51 IST|Sakshi

సాక్షి, కృష్ణా: ఒకటో తరగతి చదువుతున్న బాలికపై ఓ రైల్వే ఉద్యోగి లైంగిక దాడికి యత్నించిన ఘటన సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్‌లో నివసించే రైల్వే ఉద్యోగికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె(11) స్థానికంగా ఉండే స్కూల్‌లో ఐదో తరగతి చదువుతుండగా రెండో కుమార్తె(8) ఒకటో తరగతి చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరైన తర్వాత రెండో కుమార్తె బయటకు వచ్చి ఆడుకుంటుండగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న రైల్వే స్వీపర్‌ వెంకయ్య(53) బాలికకు మాయమాటలు చెప్పి పక్కనే శిథిలావస్థలో ఉన్న రైల్వే క్వార్టర్స్‌లోకి తీసుకువెళ్లాడు.

ఆపై బాలిక ఒంటిపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక ఏడుస్తూ కేకలు వేస్తుండగా, అప్పటికే బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు చుట్టు పక్కల వెతుకుతున్నారు. ఈ క్రమంలో పాడుపడిన క్వార్టర్స్‌ నుంచి బాలిక ఏడుపులు వినిపిండచంతో హుటాహుటిన అక్కడకు వెళ్లి చూడగా.. వెంకయ్య బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అతను వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు.ఈ ఘటనపై తల్లిదండ్రులు మంగళవారం సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వెంకయ్యను సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా అరెస్టు చేసి, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు