3 రోజులు భార్యతో.. 3 రోజులు ప్రియురాలితో.. ఆ తర్వాత

16 Feb, 2021 20:14 IST|Sakshi

అచ్చం సినిమాను తలపించే సంఘటన

భార్యతో 3 రోజులు, ప్రియురాలితో మూడు రోజులు ఉండాలంటూ పోలీసుల సూచన

రాంచీ: సీనియర్‌ హీరో, దివంగత నటుడు శోభన్‌ బాబు, వాణిశ్రీ, శారదల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎవండోయ్‌.. ఆవిడొచ్చింది’ మూవీ గుర్తుంది కదా. అందులో శోభన్‌ బాబు ఇద్దరి పెళ్లాల ముద్దులి మొగుడిగా నటించాడు. వారంలో మూడు రోజులు శారద దగ్గర, మరో మూడు రోజులు వాణిశ్రీ దగ్గర ఉంటాడు. ఇక ఏడవ రోజు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతాడు. అయితే ఇటీవల అచ్చం ఈ మూవీని తలపించే సంఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. రాంచీలో కోక్రతిరోల్‌ రోడ్డుకు చెందిన రాజేష్‌ మహోతో అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. అతడికి ఓ కూతురు కూడా పుట్టింది. ఈ క్రమంలో రాజేష్‌కు మరో యువతితో పరిచయం ఏర్పడింది. ఇక ఆమె దగ్గర పెళ్లైన సంగతి దాచి సదరు యువతితో ప్రేమయాణం సాగించాడు. ఈ క్రమంలో యువతితో కలిసి నెలరోజుల క్రితం పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక భర్త కనిపించకుండ పోవడంతో రాజేష్‌ భార్య బట్వార్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

అలాగే సదరు యువతి తల్లిదండ్రులు సైతం రాజేష్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కూతురిని అతడు కిడ్నాప్‌ చేశాడని, తమ కూతురిని వెతికి పెట్టాలని వారు బట్వార్‌ పోలీసులతో పేర్కొన్నారు. ఇరువురి ఫిర్యాదు మేరకు రాజేష్‌తో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం రాజేష్‌ ప్రియురాలితో సహా పోలీసులకు దొరికిపోయాడు. అయితే అప్పటికే సదరు యువతిని పెళ్లి చేసుకున్నట్లు రాజేష్‌ పోలీసులతో పేర్కొన్నాడు. దీంతో రాజేష్‌ భార్యను పలిపించి పోలీసులు జరిగిన విషయం చెప్పారు. ఇక అతడికి ఇదివరకే వివాహమైందని, ఓ కూతురు కూడా ఉందన్న నిజం తెలిసి సదరు యువతి అవాక్కైంది. రాజేష్‌కు ఇదివరకే పెళ్లైన విషయం దాచిపెట్టి తనకు దగ్గరైనట్లు సదరు యువతి పోలీసుల ఎదుట వాపోయింది. ఈ నేపథ్యంలో రాజేష్‌ భార్య, ప్రియురాలికి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అతడు నా భర్త అంటే నా భర్త అంటూ ఇద్దరూ గొడవకు దిగారు.

దీంతో పోలీసులు వారిద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఓ సలహా ఇచ్చారు. వారంలో మూడు రోజులు మొదటి భార్య దగ్గర ఉండాలని, మరో మూడు రోజులు ప్రియురాలి వద్ద ఉంటాడని, ఇక మిగిలిన ఒక్కరోజు అతడి ఇష్టమంటూ పోలీసులు ముగ్గురి మధ్య రాజీ కుదిర్చి బాండ్‌ పేపర్స్‌పై ముగ్గురి సంతకాలు తీసుకుని ఇంటికి పంపించారు. అయితే రాజేష్‌ మొదటి భార్య దగ్గరికి వెళ్లిపోవడంతో ప్రియురాలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి అతడిపై ఫిర్యాదు చేసింది. రాజేష్‌ తనని మోసం చేశాడని, తన మొదటి వివాహ విషయం దాచి తనపై లైంగికదాడి చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఇక ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు మొదటి భార్య ఇంటికి వెళ్లారు. అప్పటికే రెండో భార్య తనపై కేసు పెట్టిన విషయం తెలుసుకుని రాజేష్‌ పరారయ్యాడు. దీంతో రాజేష్‌ పారిపోవడానికి మొదటి భార్యే సహాకరించిందంటూ ప్రియురాలు కోర్టుకు వెళ్లింది. కాగా ప్రస్తుతం పోలీసులు రాజేష్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్య చేపట్టారు.

(చదవండి: వైరల్‌ : పాలు అమ్మడానికి హెలికాప్టర్‌ కొనేశాడు)
              (జూనియర్‌ 'చిరు'ను పరిచయం చేసిన మేఘనా)

మరిన్ని వార్తలు