‘డీఎస్పీ’ హత్య తరహాలోనే మరో ఘటన.. మహిళా ఎస్సైని లారీతో తొక్కించి..!

20 Jul, 2022 11:29 IST|Sakshi

రాంచీ:  హర్యానా మైనింగ్‌ మాఫియా చేతిలో హత్యకు గురయ్యారు డీఎస్పీ సురేంద్రసింగ్‌ బిష్ణోయ్. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో దారణం చోటు చేసుకుంది. డీఎస్పీ హత్య తరహాలోనే ఓ మహిళా ఎస్సైని వాహనంతో తొక్కించి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో మంగళవారం రాత్రి జరిగింది. 

రాంచీ నగరంలోని టుపుదానా ఔట్‌పోస్ట్‌ ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంధ్య టోప్నే. రోజులాగే వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ వాహనంతో వేగంగా దూసుకొచ్చి ఎస్సైని తొక్కించారు. ‘పశువులను తరలిస్తున్నారని ఎస్సైకి సమాచారం అందింది. ఆ వాహనాన్ని అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించారు. దాంతో ఎస్సైని ఢీకొట్టాడు డ్రైవర్‌. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద‍్యులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి వాహనాన్ని సీజ్‌ చేశాం. ’అని సీనియర్‌ ఎస్పీ కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. 

హర్యానాలోని నూహ్‌లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన ఓ డీఎస్పీ ర్యాంక్‌ అధికారిని మైనింగ్‌ మాఫియా హత‍్య చేసిన కొన్ని గంటల్లోనే మహిళా ఎస్సై హత్య జరగటం కలకలం సృష్టించింది. డీఎస్పీ సురేంద్ర సింగ్‌ బిష్ణోయ్‌ హత్య కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: Haryana DSP Murder: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్‌

మరిన్ని వార్తలు