‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్‌.. అంతలోనే..

28 Oct, 2021 07:51 IST|Sakshi
శ్రావణి (ఫైల్‌) 

వివాహిత అనుమానాస్పద మృతి

పెళ్లయిన 11 నెలలకే అఘాయిత్యం

భర్తే హత్య చేశాడంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ 

సాక్షి, మొయినాబాద్‌: ‘అమ్మా..నేను చనిపోతున్నా..’ ఓ వివాహిత తన తల్లికి ఫోన్‌ చేసి ఏడుస్తూ చెప్పింది. అంతలోనే ఫోన్‌కట్‌ చేసి చెప్పినంత పనిచేసింది. పెళ్లయిన పదకొండు నెలలకే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటన మొయినాబాద్‌ మండల చిలుకూరులో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మెదక్‌ జిల్లా తూప్రాన్‌కు చెందిన శ్రావణి (26)తో చిలుకూరుకు చెందిన అవురం రాజశేఖర్‌రెడ్డి వివాహం గత సంవత్సరం నవంబర్‌ 27న జరిగింది.

పెళ్లి సమయంలో అమ్మాయి కుటుంబం వారు 40 తులాల బంగారం, రూ.40 లక్షలు నగదు, తూప్రాన్‌లో ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. కొన్ని రోజులు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం శ్రావణి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. శ్రావణి ఉరివేసుకుని వేలాడుతుండగా గమనించిన చుట్టుపక్కల వారు, ఆమె అత్త కిందకు దింపారు. అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 
చదవండి: ఉషా అందుకు నిరాకరిచండంతో.. చెరువు వద్దకు పిలిచి..

శ్రావణి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

తల్లికి ఫోన్‌ చేసి.. 
శ్రావణి బుధవారం తల్లి పద్మకు ఫోన్‌చేసి మాట్లాడింది. నేను చనిపోతాను అంటూ ఏడుస్తూ ఫోన్‌ కట్‌చేసింది. కొద్ది సేపటి తరువాత తల్లి మళ్లీ ఫోన్‌ చేస్తే ఎత్తలేదు. అంతలోనే ఉరివేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధించేవాడని.. దసరా పండుగకు ముందు శ్రావణిని కొట్టాడని బంధువులు ఆరోపించారు. అతడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేశారు. 

శవాన్ని తరలించవద్దంటూ ఆందోళన 
పరారీలో ఉన్న భర్త రాజశేఖర్‌రెడ్డిని పట్టుకొచ్చే వరకు శవాన్ని తరలించవద్దంటూ బంధువులు ఆందోళనకు దిగారు. శ్రావణి తల్లి, బంధువులు రాకముందే శవాన్ని ఎందుకు కిందికి దింపారని నిలదీశారు. రాత్రి 8 గంటల వరకు కూడా శ్రావణి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. భర్తను పట్టుకొచ్చే వరకు శవాన్ని తరలించేదిలేదని పోలీసులను కూడా  అడ్డుకున్నారు.

మరిన్ని వార్తలు