Crime: రియల్‌ వ్యాపారి దారుణ హత్య: కళ్లల్లో కారం కొట్టి.. రాళ్లతో కొట్టి చంపి

17 Mar, 2022 08:12 IST|Sakshi
ఆదినారాయణ (ఫైల్‌)

యర్రగొండపాలెం(ప్రకాశం జిల్లా): రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నెలకొన్న పోటీ హత్యకు దారి తీసింది. బుధవారం స్థానిక గోశాలకు సమీపంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అచ్యుత ఆదినారాయణ (40)ను అదే వ్యాపారం చేసే కొంతమంది దాడి చేసి దారుణంగా హత్య చేశారు. వివరాలు.. ఆదినారాయణ తన అన్నదమ్ములతో కలిసి స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద స్టీల్‌ వ్యాపారం చేసుకుంటున్నాడు. యర్రగొండపాలెంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా పుంజుకుంటున్న తరుణంలో అతడు స్థలాలను కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తున్నాడు. ఇటీవల కాలంలో స్థానిక త్రిపురాంతకం రోడ్డులో కొంత స్థలం కొనుగోలు చేశాడు.

చదవండి: బరితెగించిన హిజ్రాలు.. బైక్‌పై వెళ్తున్న దంపతులను అడ్డగించి..

అదే స్థలాన్ని రియల్‌ వ్యాపార ప్రత్యర్థులు కూడా కొనుగోలు చేయడంతో వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో స్థానిక మాచర్ల రోడ్డులో ఉన్న తన ప్లాట్ల వద్దకు మోటారు బైక్‌పై వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆదినారాయణను ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయతి్నంచారు. అప్పుడు తప్పించుకున్న ఆదినారాయణ నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గోశాలలో సభ్యుడైన ఆదినారాయణ అక్కడ జరుగుతున్న పనులను అప్పుడప్పుడూ వెళ్లి పర్యవేక్షిస్తుంటాడు. దీన్ని అదనుగా చేసుకొని ప్రత్యర్థులు కిరాయి గూండాలకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలిసింది.

ఆయన వెంట మోటారు బైక్‌పై మరో వస్త్ర వ్యాపారి నారాయణ సింగ్‌ కూడా ఉన్నాడు. ప్రత్యక్ష సాక్షి అయిన సింగ్‌ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు తాను ఆదినారాయణ కలిసి గోశాల నుంచి మోటారు బైక్‌పై పట్టణంలోకి వస్తున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు మద్యం తాగి తూలుతున్నట్లు నటిస్తూ మోటారు బైక్‌కు అడ్డంగా వచ్చారని తెలిపాడు. తాము మోటారు బైక్‌ నిలిపిన వెంటనే వారు తమ కళ్లలో కారం చల్లి ఆదినారాయణను రాళ్లతో కొట్టారని, తనను లాగి పక్కకు నెట్టారని సింగ్‌ పోలీసులకు వివరించాడు. గతంలో కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తూ బస్టాండ్‌ సెంటర్‌లో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వెంటనే మార్కాపురం డీఎస్పీ కిశోర్‌ కుమార్‌ హుటాహుటిన వచ్చి విచారణ చేపట్టారు.  

>
మరిన్ని వార్తలు