యాక్షన్‌ సినిమా స్టైల్లో రియల్టర్‌ కిడ్నాప్‌.. కేసు ఛేదించిన పోలీసులు

8 Aug, 2021 11:51 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌: నిర్మల్ జిల్లాలో రియల్టర్‌ కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణంలోని దివ్యానగర్ లో గల తన్వి అపార్ట్‌మెంట్‌లో స్థిరాస్తి వ్యాపారి విజయ్ చందర్ దేశ్‌పాండేను ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు ఆయనను బలవంతంగా లాక్కొని అపహరించారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ విషయమై పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. స్థానికులు తెలిసిన సమాచారం మేరకు గంజాల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల వివరాలు గుర్తించారు. నిందితులు హైదరాబాద్ మార్గంలో వెళ్లినట్లు గుర్తించి ఆ మార్గంలోని పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం పట్టుబడగా మరో వాహనం తూప్రాన్ వద్ద పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు విజయ్ చందర్ దేశ్‌పాండేను స్టేషన్‌కు తరలించారు. సంగారెడ్డి కి చెందిన కృష్ణారావు ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు డీఎస్పీ ఉపేంద్రా రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు