బంధువని నమ్మితే.. భర్త పెన్షన్‌ కొట్టేశాడు..

17 Jun, 2021 10:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సైదాబాద్‌(హైదరాబాద్‌): బంధువని నమ్మి చనిపోయిన భర్తకు రావాల్సిన పెన్షన్‌ పనులు అప్పగించిన వృద్ధురాలినే మోసం చేశాడు ఓ ఘనుడు. విషయం పసిగట్టిన బాధితురాలు బుధవారం సైదాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిస వివరాల ప్రకారం... సైదాబాద్‌కు చెందిన సర్వారీ బేగం ప్రస్తుతం నిజామాబాద్‌లోని తన కూతురు ఇంట్లో ఉంటోంది. ఆమె భర్త ఎంఏ. సత్తార్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ 2006 నవంబర్‌లో మృతి చెందాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త చనిపోవటంతో అతనికి రావాల్సిన పెన్షన్‌ తదితర బెనిఫిట్స్‌ మంజూరు చేయించే పనులను బంధువైన అబ్దుల్‌ హక్‌ అలీంకు అప్పగించింది. అయితే అతను ఆ పనులు చేయిస్తానని నమ్మబలికి ఆమె నుంచి కొన్ని తెల్ల కాగితాలు, స్టాంప్‌ పేపర్ల మీద వేలిముద్రలు తీసుకున్నాడు.

అయితే ఇటీవల తన భర్తకు రావాల్సిన రూ.14 లక్షల పెన్షన్‌ మంజూరు అయ్యాయని వాటిని తన బంధువు అబ్దుల్‌ ఆమె వేలిముద్రలు వేసిన కాగితాల సహాయంతో తన ఎకౌంట్‌లోకి వేసుకున్నాడని తెలిసింది. అంతేకాకుండా తానే అబ్దుల్‌కు రూ.8.90 లక్షలు అప్పుగా ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడని పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: యువతిని పెళ్లి చేసుకుంటానని కానిస్టేబుల్‌ మోసం 

మరిన్ని వార్తలు