Penukonda Train Incident: రైలు నుంచి జారి పడి విశ్రాంత లోకో పైలెట్‌ మృతి

31 May, 2022 08:43 IST|Sakshi

పెనుకొండ: ప్రమాదవశాత్తు విశ్రాంత లోకో పైలెట్‌ రైలు కిందపడి మృతి చెందారు. వివరాలు.. కొత్తచెరువు మండలం గంగినేపల్లికి చెందిన రంగేనాయక్‌ (65) లోకో పైలెట్‌గా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటకలోని హుబ్లీలో నివాసముంటున్న ఆయన మూడు రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి పెనుకొండ మండలం గోనిపేటకు వచ్చారు. సోమవారం తెల్లవారుజామున కుటుంబసభ్యులతో కలిసి హుబ్లీకి వెళ్లేందుకు పెనుకొండ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కదులుతున్న హంపీ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కబోతుండగా అదుపుతప్పి ప్లాట్‌ఫాంపై పడ్డాడు. ఘటనలో ఛాతీకి బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.  

నీటి ట్యాంకులో మునిగి బాలుడి మృతి 
కళ్యాణదుర్గం:  ప్రమాదవశాత్తు నీటి ట్యాంకులో మునిగి ఓ బాలుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లుకు చెందిన గీత, బ్రహ్మయ్య దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు సిద్దు (10) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ గ్రామ సమీపంలోని ఊర కొండపై ఉన్న నీటి ట్యాంక్‌లో తాడు సాయంతో ఈత కొడుతుండగా తాడు జారిపోయింది. దీంతో నీట మునిగి మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ట్యాంక్‌లో నుంచి సిద్దు మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.    

(చదవండి: భార్య, అత్తపై కత్తితో దాడి)

మరిన్ని వార్తలు