ఈనెల 9 వరకు ఎన్‌సీబీ అదుపులో షోవిక్‌

5 Sep, 2020 15:26 IST|Sakshi

ముంబై: నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ చక్రవర్తి ఈనెల 9 వరకు తమ కస్టడీలోనే ఉంటాడని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ కేసులో అతడితో పాటు అరెస్టైన శామ్యూల్‌ మిరండాను కూడా నాలుగు రోజుల పాటు విచారించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా డ్రగ్‌ డీలర్‌ కైజాన్‌ ఇబ్రహీంను 14 రోజుల పాటు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మృతి కేసు విచారణలో భాగంగా డ్రగ్స్‌ వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్‌, సుశాంత్‌ ఇంటి మేనేజర్‌ శామ్యూల్ మిరాండాలు డ్రగ్స్‌ గురించి చర్చించుకున్న వాట్సాప్‌ చాట్స్‌ బయటపడిన నేపథ్యంలో రియాపై కేసు నమోదైంది.(చదవండి: థాంక్యూ గాడ్‌: సుశాంత్‌ సోదరి)

దీంతో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ అధికారులు శుక్రవారం షోవిక్‌, మిరాండాల నివాసంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి వారిద్దరిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా శామ్యూల్‌ తన గూగుల్‌ పే అకౌంట్‌ ద్వారా డ్రగ్‌ డీలర్లకు డబ్బు చెల్లించినట్లు తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అసలు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన డ్రగ్‌ డీలర్లు జైద్‌ విల్తారా, అబ్దుల్‌ బాసిత్‌ పరిహార్‌ల నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.  (చదవండి: 5 కిలోల డ్రగ్స్‌కు డబ్బు చెల్లించు: షోవిక్‌)

మరిన్ని వార్తలు