-

రైస్‌పుల్లింగ్‌: రాగిపాత్రకు రంగుపూసి..

21 May, 2021 08:18 IST|Sakshi

రైస్‌పుల్లింగ్‌ ముఠా సభ్యులు 13 మంది అరెస్టు

మూడు కార్లు, ద్విచక్రవాహనం, రూ.20 వేలు నగదు స్వాధీనం  

మదనపల్లె టౌన్‌(చిత్తూరు జిల్లా): రైస్‌పుల్లింగ్‌ ముఠా సభ్యులు 13 మందిని మదనపల్లె రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. మూదు కార్లు, ద్విచక్ర వాహనం, రూ. 20 వేలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ కథనం మేరకు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఓ ముఠా రైస్‌పుల్లింగ్‌ పేరుతో మోసం చేస్తోందని సమాచారం అందింది. బుధవారం సాయంత్రం మదనపల్లె రూరల్‌ మండలంలో మదనపల్లె–పుంగనూరు మార్గంలోని బసినికొండ వై–జంక్షన్‌  వద్ద మూడు వాహనాల్లో వచ్చిన కొంతమంది రాగిపాత్రను పరిశీలిస్తున్నారు.

పోలీసులు అక్కడికి వెళ్లడాన్ని చూసి పరారయ్యేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. రాగిపాత్రకు రంగుపూసి టార్చిలైట్‌ వేస్తే కొంత సేపటికి లైటింగ్‌ ఆగిపోతుందని, తరువాత ఆ పాత్ర మహిమ కలిగిన రైస్‌ ఫుల్లింగ్‌(అక్షయపాత్ర)గా మారిపోతుందని నమ్మిస్తున్నారు. ఆ పాత్రను రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు విక్రయించేందుకు యత్నిస్తున్నారు. నిందితులను అరెస్టు చేశారు. మూడు కార్లు, ద్విచక్రవాహనం రూ.20,700 నగదు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో తిరుపతి ఎన్జీవో కాలనీకి చెందిన శాంతిలాల్‌(37), రామచంద్రాపురం మండలం చుట్టగుంట గ్రామానికి చెందిన జె.శ్రీనివాసులు(45), దుర్గసముద్రం ప్రాంతానికి చెందిన ఎన్‌.శివశంకరయ్య(48), మదనపల్లె రూరల్‌ మండలం బసినికొండకు చెందిన జి.శ్రీనివాసులు(35) వైఎస్‌ఆర్‌ జిల్లా చిప్పిడిరాళ్ల గ్రామానికి చెందిన కె.మధుసూదన్‌రెడ్డి(32), కర్ణాటకలోని ఎలహంకకు చెందిన కె.ఎం.మునీష్‌(27), చిక్‌బళ్లాపూర్‌కు చెందిన వి.నాగరాజు(25), అనంతపురం జిల్లా బండార్లపల్లెకు చెందిన న్యాయవాది డి.చెన్నారెడ్డి(55), తాడిపత్రిలోని సుంకులమ్మ కాలనీకి చెందిన పి.నాగరాజు(40), నంద్యాల రోడ్డు సీపీఐ కాలనీకి చెందిన పి.చంద్రహాస్‌(21), ఎర్రంకలవారిపల్లెకు చెందిన బి.ప్రేమానందరెడ్డి(42) తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా వెంకటాపూర్‌కు చెందిన డి.రాజేంద్రప్రసాద్‌(33), కూకుట్‌పల్లెలోని నీలాద్రీ టవర్స్‌కు చెందిన ఎస్‌.అశోక్‌రెడ్డి(42) ఉన్నారు.

చదవండి: యువతి బ్లాక్‌మెయిల్‌: డబ్బులు పంపించు.. లేదంటే..   
ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఊహించని షాకిచ్చిన భర్త 

మరిన్ని వార్తలు