ఎంతటి విషాదం: నవ దంపతులు కరోనాను జయించారు.. కానీ

1 Jun, 2021 12:01 IST|Sakshi

ఆమదాలవలస: ఆరు నెలల కిందటే ఆ తల్లి తన కొడుక్కి ఆడంబరంగా పెళ్లి చేసింది. ఇంట అడుగు పెట్టిన కోడల్ని చూసి మురిసిపోయింది. కొడుక్కి రైల్వేలో ఉద్యోగం కూడా ఉండడంతో మలి సంధ్య హాయిగా గడిచిపోతుందని ఆశ ప డింది. కానీ ఆమె ఆశలు అడియాసలయ్యాయి. పెళ్లి జ్ఞాప కాలు ఇంకా ఆకుపచ్చగా ఉండగానే ఆ దంపతులు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

అందివచ్చిన కొడుకు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించా రు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కనిమెట్ట జంక్షన్‌ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస గ్రామానికి చెందిన రౌతు యోగేశ్వరరావు(26), తన భార్య రౌతు రోహిణి(22) దుర్మరణం పాలయ్యారు. 

వివరాల్లోకి వెళితే..  యోగేశ్వరరావు విశాఖలో రైల్వే కలాసీగా పనిచేస్తున్నా డు. ఆరు నెలల కిందటే రోహిణితో అతనికి పెళ్లయ్యింది. విశాఖలోనే కాపురం పెట్టారు. కానీ నెల రోజుల కిందట దంపతులకు కరోనా సోకడంతో గాజులకొల్లివలసలోనే ఉండి వి శ్రాంతి తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక తిరిగి విధుల్లోకి చేరడానికి దంపతులిద్దరూ సోమవారం స్కూటీపై విశాఖ బయల్దేరారు. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ సమీపంలో కనిమెట్ట జంక్షన్‌ వద్దకు చేరే సరికి.. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలీని వాహనం వీరి స్కూటీని బలంగా ఢీకొంది.

దీంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రోహిణి ప్రస్తుతం రెండో నెల గర్భిణి. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న మృతుడి తల్లి గుండెలవిసేలా రోదించారు. ఆమె రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు. పూసపాటిరేగ ఎస్‌ఐ ఆర్‌.జయంతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు.
చదవండి: రౌడీషీటర్‌ పండు వీరంగం.. స్నేహితుడిపై కత్తులతో దాడి

మరిన్ని వార్తలు