మృత్యువులోనూ వీడని స్నేహం

24 Jul, 2022 23:24 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి  

కరిడికొండ సమీపంలో దుర్ఘటన 

ఆలూరు: వారిద్దరూ స్నేహితులు. కలిసిమెలిసి తిరిగేవారు. వ్యక్తిగత పని నిమిత్తం దేవనకొండకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన శనివారం రాత్రి దేవనకొండ మండలం కరిడికొండ సమీపంలో చోటుచేసుకుంది. కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన బోయ సుధాకర్‌ (36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈయనతో అదే గ్రామానికి చెందిన తెలుగు వెంకటేష్‌ (38) స్నేహం చేసేవాడు.

ఇద్దరూ కలసి శనివారం సాయంత్రం వ్యక్తిగత పనినిమిత్తం మోటారు సైకిల్‌పై దేవనకొండకు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా రాత్రి 8:30 గంటల సమయంలో కరిడికొండ గ్రామ సమీపాన కర్నూలు వైపు నుంచి ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం బలంగా మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకుని ఎస్‌ఐ శ్రీనివాసులుకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,  కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయ సుధాకర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె, తెలుగు వెంకటేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్నేహితులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కప్పట్రాళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.   

మరిన్ని వార్తలు