పెళ్లయిన 21 రోజులకే మృత్యు ఒడిలోకి..

2 Jan, 2022 14:02 IST|Sakshi
నరేశ్‌(ఫైల్‌)

సాక్షి, జన్నారం(ఆదిలాబాద్‌): పెళ్లి సంబురం తీరకముందే రోడ్డు ప్రమాదం రూపంలో యువకుడిని మృత్యువు కబళించింది. ద్విచక్ర వాహనం అతివేగంగా నడపడంతో అదుపుతప్పి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేళ ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఎస్సై మధుసూదన్‌రావు, మృతుడి తండ్రి మురిమడుగుల రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం పొనకల్‌ సాయిబాబ టెంపుల్‌ కాలనీలో నివాసం ఉంటున్న రాజన్నకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

పెద్ద కుమారుడు మురిమడుగుల నరేశ్‌(23)కు గత డిసెంబర్‌ 10న వివాహం జరిగింది. నూతన సంవత్సరం పురస్కరించుకుని శుక్రవారం స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు. ఈ క్రమంలో లింగయ్యపల్లి గ్రామంలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి పిలవడంతో రాత్రి 9గంటల ప్రాంతంలో మరో స్నేహితుడు గుడ్ల శ్రావణ్‌కుమార్‌తో కలిసి తన ద్విచక్ర వాహనంపై వెళ్లాడు.

అతివేగం కారణంగా ధర్మారం రోడ్డు వైశ్య భవన్‌ సమీపంలో మూలమలుపు వద్ద మోటార్‌సైకిల్‌ అదుపు తప్పి చెట్టును ఢీకొని పొలాల్లో పడిపోయారు. తీవ్ర గాయాలైన వారిద్దరిని 108లో తరలిస్తుండగా నరేశ్‌ మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

పెళ్లి సంబురం తీరకముందే.. 
నరేశ్‌కు డిసెంబర్‌ 10న వివాహం జరిగింది. ఆ సంబరం ఇంట్లో ఇంకా పూర్తి కాలేదు. చుట్టాల రాకపోకలు సాగుతున్నాయి. ఇంకా సంబరం తీరకముందే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. తన భర్త విగతా జీవిగా పండి ఉండడాన్ని చూసి నవ వధువు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.  

చదవండి: కారులో చిన్నారి.. అద్దాలు పగులకొట్టిన పోలీసు.. ట్విస్ట్‌ ఏంటంటే

మరిన్ని వార్తలు