నలుగురు దొంగలు.. రూ.12 కోట్ల ఫోన్లు కొట్టేశారు!

28 Aug, 2022 06:33 IST|Sakshi

24 గంటల్లోపే రికవరీ

సాగర్‌ (మధ్యప్రదేశ్‌): కోట్లు విలువచేసే స్మార్ట్‌ఫోన్లను రవాణా చేస్తున్న కంటైనర్‌ను నలుగురు దొంగలు లూటీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా మహరాజ్‌పూర్‌ సమీపంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ చోరీ జరిగింది. అయితే ఆ ఫోన్లన్నింటినీ 24 గంటల్లోపే పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దొంగలు మాత్రం పారిపోయారు. దాదాపు రూ.12 కోట్ల విలువైన ఈ మొబైల్‌ ఫోన్లను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా హరియాణాలోని గురుగ్రామ్‌కు తీసుకెళ్తున్నారు.

ట్రక్కును గురువారం రాత్రి నలుగురు దుండగులు అడ్డుకుని డ్రైవర్‌ను కిడ్నాప్‌ చేశారు. నరసింగాపూర్‌ వద్ద అతన్ని దింపేసి ఫోన్లను కంటైనర్‌ నుంచి తమ ట్రక్కులోకి మార్చుకుని పారిపోయారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలికి 400 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్‌ పోలీసులు అడ్డగించడంతో ట్రక్కును వదిలేసి పారిపోయారు. మొత్తం ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సాగర్‌ ఎస్పీ తరుణ్‌ నాయక్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు