ఫాంహౌస్‌లో దొంగల బీభత్సం

18 Aug, 2020 06:28 IST|Sakshi
సంఘటన జరిగిన ఇంటిని పరిశీలిస్తున్న పోలీసులు (ఇన్‌ సెట్‌లో) హత్యకు గురైన మంజునాథ్‌ (ఫైల్‌)

యువకున్ని చంపి, నగదు, నగలు దోపిడీ 

దాబస్‌పేట వద్ద ఘటన

దొడ్డబళ్లాపురం: దోపిడీ దొంగలు ఒక ఫాంహౌస్‌లో చొరబడి యువకున్ని చంపి పెద్దమొత్తంలో నగలు, డబ్బును దోచుకున్నారు. ఈ ఘోరం దొడ్డ తాలూకా దొడ్డ బెళవంగల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మంజునాథ్‌ (22)హత్యకు గురైన యువకుడు. దాబస్‌పేట–దొడ్డబళ్లాపురం జాతీయ రహదారి మార్గంలోని హులికుంట గ్రామం వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఒక తోటలో ఈ సంఘటన జరిగింది. 

మంచినీళ్లు కావాలంటూ వచ్చి  
తోటలోని ఇంట్లో మృతుడు మంజునాథ్‌ ఇతడి తల్లి, అక్క ముగ్గురే నివసిస్తుండేవారు. ఆదివారం అర్ధరాత్రి కొందరు అపరిచిత వ్యక్తులు తలుపు తట్టి తాగడానికి నీళ్లు కావాలని అడిగారు. తలుపులు తీయగానే లోపలకు జొరబడ్డ దుండగులు ముగ్గురిపైనా దాడిచేసి దోపిడీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో మంజునాథ్‌ అడ్డుకోవడంతో కత్తితో పొడిచారు. తరువాత దొరికిన నగలు, నగదు దోచుకుని ఇంటి ముందు నిలిపి ఉన్న బైక్‌ను తీసుకుని పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మంజునాథ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మంజునాథ్‌ తల్లి లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దొడ్డబెళవంగల పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు