20 ఏళ్లు జైల్లో.. అయినా మళ్లీ

13 Aug, 2021 08:27 IST|Sakshi

బంజారాహిల్స్‌( హైదరాబాద్‌): మర్డర్‌ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించినా ప్రవర్తనలో మార్పు రాలేదు.. పీడీయాక్ట్‌ నమోదు చేసి రెండేళ్లు జైల్లో ఉంచినా తీరు మార్చుకోలేదు. రౌడీషీట్‌ ఓపెన్‌ చేసి కదలికలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా మార్పులేదు.. తరచూ బెదిరింపులకు పాల్పడుతూ, దారికాచి బెదిరిస్తూ.. హెచ్చరికలు జారీ చేస్తూ.. పలువురిని ఇబ్బందులకు గురిచేసే క్రమంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.

గత అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా క్షమాభిక్షలో భాగంగా సత్ప్రవర్తన కింద ఏడాది క్రితం విడుదలయ్యాడు. జైలులో ఉన్న స్రత్పవర్తన సమాజంలోకి వచ్చాక మళ్లీ పాత కథనే కొనసాగిస్తున్నాడు.  మహిళ పట్ల అసభ్యంగా  ప్రవర్తించిన రౌడీషీటర్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని లక్ష్మీనరసింహ నగర్‌లో నివసించే ఓ మహిళ పట్ల అదే ప్రాంతంలో నివసిస్తున్న రౌడీషీటర్‌ లక్ష్మణ్‌(46) ఈ నెల 11వ తేదీన ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమె భర్తను కొట్టడమే కాకుండా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అరుపులు విన్న భార్య అక్కడికి చేరుకొని ఆపేందుకు యత్నించగా లక్ష్మణ్‌ ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను కిందకు తోసేశాడు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు రౌడిషీటర్‌ లక్ష్మణ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు