రౌడీషీటర్‌ దారుణ హత్య 

6 Sep, 2020 10:20 IST|Sakshi

సాక్షి, చాంద్రాయణగుట్ట: రౌడీ షీటర్‌ దారుణ హత్యకు గురైన ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.దేవేందర్‌ వివరాల ప్రకారం.. అచ్చిరెడ్డినగర్‌కు చెందిన మహ్మద్‌ జావెద్‌ ఖాన్‌ అలియాస్‌ జాడో (28) రౌడీషీటర్‌. ఎన్నో నేరాలకు పాల్పడ్డ ఈ నిందితుడు పలుమార్లు జైలు జీవితం గడిపాడు. అయినా ప్రవర్తనలో మార్పు లేకుండా దాడులు, బెదిరింపులు, న్యూసెన్స్‌లు చేస్తుంటాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కామాటీపురా ప్రాంతంలో అటుగా వెళ్తున్న ముస్తఫా ఘాజీ అనే యువకుడి ద్విచక్ర వాహనాన్ని ఆపి గంజాయి ప్యాకెట్‌ లాక్కొని బెదిరించి పంపించాడు. (కూతురు ఫోన్‌ రికార్డుతో బయటపడ్డ మర్డర్‌ స్కెచ్‌)

ఈ విషయాన్ని మనసులో ఉంచుకున్న ముస్తఫా రాత్రి 9.30 గంటల తన స్నేహితులు సయ్యద్‌ బాబా, ఆనంద్‌ కుమార్‌ మిశ్రా, నాజంతో కలిసి కత్తులు, నకల్‌ పంచ్‌తో అన్సారీ రోడ్డులో జావెద్‌పై దాడి చేసి పొడిచారు. ఛాతి, కడుపు భాగాల్లో దాదాపు ఏడెనిమిది పోట్లు దిగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఘటనా స్థలాన్ని దక్షిణ మండలం ఇన్‌ఛార్జి డీసీపీ గజరావు భూపాల్, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్‌ పరిశీలించి.. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు గంజాయి మత్తులోనే ఈ హత్యకు తెగబడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.   

మరిన్ని వార్తలు