బాలుడి ఆచూకీ చెబితే రూ.లక్ష!

21 Mar, 2021 14:17 IST|Sakshi

గీసుకొండ: రాజస్థాన్‌ రాష్ట్రంలోని అల్వార్‌ జిల్లా రేణి గ్రామానికి చెందిన పలువురు గత ఏడాది కొమ్మాల జాతరలో ఆట వస్తువులు అమ్ముకునేందుకు వచ్చారు. వీరిలో భగర్య ధర్మవీర్‌– సీత దంపతుల కుమారుడు భగర్య ప్రదీప్‌(6) అదే ఏడాది మార్చి 10న జాతరలో తప్పిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా పోలీసులతోపాటు, బాలల సంరక్షణ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. బస్సులపై పోస్టర్లు అంటించినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు ఎప్పటికైనా తిరిగి రాకపోతాడా అని తల్లిదండ్రులు కొన్ని నెలల పాటు ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. అయితే, బాలుడు తప్పిపోయి ఏడాది గడిచిపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది.

కాగా, శనివారం కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వచ్చిన మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌ బాలుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష నజరానా అందజేస్తామని ప్రకటించారు. అదేవిధంగా వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అలాగే, ఈసారి జాతరలో కూడా బాలుడి వాల్‌పోస్టర్లు వేయిస్తామని పేర్కొన్నారు. 

చదవండి: నిర్లక్ష్యం: స్విమ్మింగ్‌ పూల్‌‌లో ఈత నేర్చుకుంటూ..

మరిన్ని వార్తలు