ఎస్‌బీఐలో రూ.77 లక్షలు చోరీ

22 Nov, 2020 05:02 IST|Sakshi
చోరీ జరిగిన బ్యాంక్‌

గుంటూరు జిల్లా నడికుడిలో ఘటన  

దాచేపల్లి: గుంటూరు జిల్లా నడికుడి ఎస్‌బీఐలో లాకర్‌లో భద్రపరచిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం అర్థరాత్రి దుండగులు బ్యాంక్‌ తూర్పు వైపున ఉన్న ద్వారం వద్దకు వెళ్లారు. గ్యాస్‌ కట్టర్‌తో తాళాలను కోసి లోనికి ప్రవేశించి సీసీ కెమెరాల కనెక్షన్‌ను తొలగించారు. స్ట్రాంగ్‌ రూంలో ఉన్న రూ.77 లక్షలను ఎత్తుకెళ్లారు. బ్యాంక్‌ మేనేజర్‌ కృష్ణారెడ్డి శనివారం బ్యాంక్‌ తలుపులు తీస్తుండగా తాళం పగిలి ఉండటాన్ని గుర్తించారు. నగదు చోరీకి గురైనట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలిని గుంటూరు జిల్లా రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని పరిశీలించారు. చోరీ ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ విశాల్‌ గున్ని  

ఈ ప్రాంతంలో అపరిచిత వ్యక్తులు తిరిగినట్లు తెలిస్తే 8866268899 నంబర్‌కు సమాచారమివ్వాలని కోరారు. కాగా, మాచర్ల ఎస్‌బీఐ నుంచి రూ.95 లక్షలను నడికుడి ఎస్‌బీఐ బ్యాంక్‌కు శుక్రవారం తరలించారు. బ్యాంక్‌లో ఉన్న ఇతర నగదు, బంగారం భద్రంగానే ఉండగా మాచర్ల నుంచి తెచి్చన నగదు మాత్రమే చోరీకి గురైంది. చోరీ వెనుక బ్యాంక్‌ సిబ్బంది ప్రమేయం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. చోరీకి గురైంది రూ.85 లక్షలని తొలుత బ్యాంక్‌ మేనేజర్‌ ఫిర్యాదు చేశారు. పోలీసుల తనిఖీల్లో ఓ బాక్స్‌లో రూ.8 లక్షలు స్ట్రాంగ్‌ రూం సమీపంలో ఉన్నట్లు గుర్తించడంతో రూ.77 లక్షలు చోరీకి గురైనట్లుగా మళ్లీ ఫిర్యాదు చేశారు.  

మరిన్ని వార్తలు