సైదాబాద్‌ నిందితుడి కదలికలు: సింగరేణి కాలనీ టు నష్కల్‌

17 Sep, 2021 12:28 IST|Sakshi
సీసీ కెమెరాలో రికార్డు అయిన నిందితుడి కదలికలు

సాక్షి, హైదరాబాద్‌: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు.. వారం రోజుల పాటు తప్పించుకు తిరిగాడు. మొదటి రెండు రోజుల పాటు అతడి కదలికలను గుర్తించగలిగారు. తర్వాత ఐదు రోజుల పాటు ఎక్కడున్నది తెలియదు. గురువారం రైలు కింద పడి చనిపోయాడు. రాజు ఈ సమయంలో నిర్మానుష్య ప్రాంతాల్లో తలదాచుకుని ఉంటాడని, అదే క్రమంలో రైలు పట్టాల వైపు వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనలో ‘సైదాబాద్‌ టు నష్కల్‌’మధ్య ఎప్పుడు ఏం జరిగిందంటే.. (సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర అంశాల ఆధారంగా..) 

9వ తేదీ సాయంత్రం 4.30: హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆడుకుంటున్న బాలికకు రాజు చాక్లెట్ల ఆశ చూపి తన గదికి తీసుకువెళ్లాడు. 

సాయంత్రం 5.47: బాలికను హత్య చేసిన తర్వాత తన ఇంటి నుంచి ఒక సంచితో పారిపోయాడు. సంతోష్‌నగర్‌ ప్రాంతంలోని లేబర్‌ అడ్డాకు చేరుకుని ఆ రోజు రాత్రంతా అక్కడే ఉన్నాడు. 

10వ తేదీ ఉదయం 9.15: సంతోష్‌నగర్‌ లేబర్‌ అడ్డా నుంచి మరో కూలీతో కలిసి యాకుత్‌పురా రైల్వేస్టేషన్‌ సమీపంలో కూల్చివేత పనికి వెళ్లాడు. 

మధ్యాహ్నం 3.30: ఇద్దరూ పని ముగిశాక డబ్బులు తీసుకుని సంతోష్‌నగర్‌ చౌరస్తా దగ్గరికి వచ్చారు. అక్కడ ఆటో ఎక్కి సాగర్‌ రింగ్‌రోడ్డు వద్దకు చేరుకున్నారు. 

మధ్యాహ్నం 3.52: సాగర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని ఓ కల్లు దుకాణంలో కల్లు తాగి, డబ్బు పంచుకున్నారు. తర్వాత ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్‌ వరకు వచ్చారు. రాజుతో ఉన్న మరో వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

సాయంత్రం 4.46: కాసేపు ఎల్బీ నగర్‌ రింగ్‌రోడ్డు వద్ద తచ్చాడిన రాజు.. అక్కడి ఓ హోటల్‌ వద్ద ఆపి ఉన్న ఆటోను చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. 

సాయంత్రం 5.03: ఆటో చోరీ వీలుకాకపోవడంతో.. నడుచుకుంటూ సమీపంలోని వైన్స్‌ షాపు వద్దకు వెళ్లాడు. మద్యం కొనుక్కుని, తాగాడు. కాసేపు అక్కడే తచ్చాడాడు. 

రాత్రి 7.28: వైన్స్‌షాపు సమీపంలో రన్నింగ్‌ బస్సును చెయ్యెత్తి ఆపాడు. బస్సు ఎక్కే సమయంలోనే తన బ్యాగ్‌ను అక్కడే పడేశాడు. 

రాత్రి 7.45: ఉప్పల్‌ రింగ్‌రోడ్‌ వద్ద రామంతపూర్‌ రోడ్‌ వైపు బస్సు దిగాడు. నడుచుకుంటూ రోడ్డు దాటి వరంగల్‌ రోడ్‌ వైపు వెళ్లాడు. ఆ తర్వాత ఆచూకీ లభించలేదు. 

16న (గురువారం) ఉదయం 8.45: ఉప్పల్‌కు దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న నష్కల్‌ వద్ద రైలు పట్టాలపై శవమయ్యాడు.   

చదవండి: రాజు మృతి: సింగరేణి కాలనీ ఊపిరి పీల్చుకుంది

మరిన్ని వార్తలు