సాక్షి, చెన్నై: శశికళ వదిన ఇలవరసి కుమారుడు వివేక్. ఇతడి భార్య కీర్తన గురు వారం ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు.. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ గురించి తెలిసిందే. శశికళతో పాటు జైలు జీవితాన్ని ఆమె వదినమ్మ ఇలవరసి కూడా అనుభవించారు. శశికళ అన్న జయరామన్ సతీమణే ఈ ఇలవరసి. ఆమె కుమారుడు వివేక్. శశికళకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలన్నీ ఇతడి కనుసన్నుల్లోనే సాగుతాయనే ప్రచారం ఉంది.
దీంతో వివేక్ను ఈడీ, ఐటీ వర్గాలు టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలో వివేక్ తన సతీమణి కీర్తనతో గత కొంత కాలంగా తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం. వివేక్ వేధింపుల గురించి పలుమార్లు శశికళ, ఇలవరసి దృష్టికి కీర్తన తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే వివేక్ను ఎవ్వరూ ప్రశ్నించక పోవడంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న పలు రకాల మాత్రలను మింగేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను అర్ధరాత్రి వేళ అడయార్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వివేక్, కీర్తన మధ్య బుధవారం రాత్రి కూడా గొడవ జరిగినట్లు విచారణలో వెలుగు చూసింది. దీంతో తీవ్ర వేదనకు గురైన కీర్తన ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలిసింది.