ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్‌ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు..

12 Mar, 2023 15:46 IST|Sakshi

ముంబై: సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు సరికొత్త పంథాల్లో సాధారణ పౌరులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏదో ఒకటి ఆశజూపి, ఎరవేసి సింపుల్ లింక్ క్లిక్ చేయమని చెప్పి క్షణాల్లో రూ.లక్షలు కాజేస్తున్నారు. మహారాష్ట్ర ముంబైలోని సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. స్కామర్లు నెక్ట్స్‌ లెవల్‌లో ఆలోచించి ఓ మహిళ నుంచి రూ.7 లక్షలు కొల్లగొట్టారు.

సౌరభ్ శర్మ అనే సైబర్ క్రిమినల్‌ తాను బ్యాంకు ఉద్యోగినని చెప్పి ఓ 40 ఏళ్ల మహిళను పరిచయం చేసుకున్నాడు. క్రెడిట్ కార్డు ఇస్తామని, దీని వల్ల స్పోర్ట్స్ క్లబ్‌లో మెంబర్‌షిప్ లభిస్తుందని చెప్పాడు. దీంతో ఆమె క్రెడిట్ కార్డు తీసుకునేందుకు ఒప్పుకుంది.

అయితే ఆ మహిళ యాపిల్ ఫోన్ ఉపయోగిస్తోంది. ఈ క్రెడిట్ కార్డు యాక్టివేషన్‌ ఐఫోన్‌లో కాదని, ఆండ్రాయిడ్ ఫోన్‌నే ఉపయోగించాలని అతడు ఆ మహిళకు చెప్పాడు. తానే ఆ ఫోన్‌ను ఉచితంగా అందిస్తానని పేర్కొన్నాడు. దీంతో మహిళ అందుకు ఒప్పుకుంది. ఫోన్ పంపించమని అతనికి అడ్రస్ వివరాలు పంపింది. కాసేపట్లోనే అతను ఆమె ఇంటికి కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ పంపాడు.

క్రెడిట్ కార్డు కోసం ఈమె ఇప్పటికే తన ఆధార్ కార్డు, బ్యాంక్ వివరాలు సౌరభ్ శర్మకు ఇచ్చింది. కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ ఓపెన్ చేసి చూడగా డాట్ సెక్యూర్, సెక్యూర్ ఎన్వాయ్ ఆథెంటికేటర్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉన్నాయి. తన సిమ్‌కార్డును ఈ ఫోన్‌లో వేసిన మహిళ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ కోసం సౌరభ్ శర్మ చెప్పినట్లు చేసి అతడి ఇన్‌స్ట్రక్చన్స్ ఫాలో అయింది.

అయితే ఆ తర్వాత కొద్ది గంటలకే ఆమె ఫోన్‌కు రెండు మెసేజ్‌లు వచ్చాయి. తన బ్యాంకు ఖాతా నుంచి రూ.7లక్షల దావాదేవీలు జరిగినట్లు చూసి ఆమె కంగుతింది. బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకుందామంటే అప్పటికే క్లోజింగ్ టైమ్ అయిపోయింది. ఆ మరునాడు బ్యాంకు వెళ్లి లావాదేవికి సంబందించిన వివరాలు తీసుకుంది. ఓ నగల దుకాణంలో ఈ లావాదేవీలు జరిగినట్లు తెలుసుకుంది. అనంతరం కందేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఈ సైబర్ క్రైంపై దార్యాప్తు చేపట్టారు.
చదవండి: రూ.150 కోట్ల ఇల్లు.. రూ.4 లక్షలకే కొన్నారు: ఈడీ

మరిన్ని వార్తలు