Bengaluru Crime: దారి తప్పి, భాష తెలియక ప్రాణం పొగొట్టుకున్న బ్యాంక్‌ ఉద్యోగి

11 Jul, 2022 15:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి(బెంగళూరు): ఎక్కడో చత్తీస్‌ఘడ్‌ నుంచి వచ్చాడు. ఇక్కడి భాష తెలియదు, ఊరు తెలియదు, చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దొంగ అని భావించి సెక్యూరిటీ గార్డు బ్యాంకు ఉద్యోగిని రాడ్‌తో కొట్టి చంపాడు. ఈ సంఘటన బెంగళూరు హెచ్‌ఏఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. మారతహళ్లి వద్ద వంశీ సిటాడెల్‌ అపార్టుమెంట్‌ వద్దకు ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో  గుర్తు తెలియని వ్యక్తి  వెళ్లాడు.

సెక్యూరిటీగార్డు శ్యామనాథ్‌ అతన్ని ఎవరని ఎన్నిసార్లు అడిగినా జవాబివ్వలేదు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో సెక్యూరిటిగార్డు రాడ్‌తో అతడి తలపై దాడిచేశాడు. తలకు తీవ్రగాయం కావడంతో వ్యక్తి అక్కడే మృతిచెందారు. హతుడు చత్తీస్‌ఘడ్‌ చెందిన బ్యాంకు ఉద్యోగి కాగా శిక్షణ తీసుకోవడానికి బెంగళూరుకు వచ్చినట్లు తెలిసింది. స్నేహితులతో విందులో పాల్గొని ఒక్కడే స్నేహితుడి రూమ్‌ కు నడుచుకుని బయలుదేరాడు. మొబైల్‌లో అడ్రస్‌ అడుగుతూ వస్తుండగా అది బ్యాటరీ అయిపోయి స్విచాఫ్‌ అయ్యింది. దీంతో దారి తప్పి వేరే అపార్టుమెంట్‌ వద్దకు వెళ్లాడు. దొంగ అని భావించి సెక్యూరిటీ గార్డు దాడి చేసినట్లు తెలిసింది. హెచ్‌ఏఎల్‌ పోలీసులు పరారీలో ఉన్న శ్యామ్‌నాథ్‌ను ను ఆదివారం అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

చదవండి: 11ఏళ్ల అనంతరం వీడిన మర్డర్‌ మిస్టరీ!

మరిన్ని వార్తలు