క్రికెట్‌ బెట్టింగ్‌ గ్యాంగ్‌ గుట్టురట్టు

10 Apr, 2022 07:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ సీజన్‌లో ప్రతి మ్యాచ్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ గ్యాంగ్‌లు పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవలే రాచకొండలో 7 మందిని, సైబరాబాద్‌ పోలీసులు 18 మంది అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకోగా.. తాజాగా మరో ముఠా ఎల్బీనగర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులకు చిక్కింది. ఇన్‌స్పెక్టర్‌ బీ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఆటోనగర్‌కు చెందిన దేవినేని చక్రవర్తి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. బెట్టింగ్‌లకు బానిసగా మారాడు. ఐపీఎల్‌ సీజన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో క్రికెట్‌ పందేలు వేసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

భీమవరానికి చెందిన అప్పల రాజు, తన బావమరిది అయిన తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలోని ముగ్గువుల్లాకి చెందిన నిడదవోలు శ్రీనివాస్‌ ఉదయ్‌ కుమార్‌ల నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహణకు అవసరమైన లైన్‌లను తీసుకునేవాడు. మన్సూరాబాద్‌లోని చండీశ్వర్‌ కాలనీకి చెందిన వేములపర్తి హరీష్‌ను సబ్‌– బుకీగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలోని మెడోస్‌ లోటస్‌ అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్‌ సెటప్‌ను ఏర్పాటు చేసుకుని ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం రాత్రి లోటస్‌ దాడులు చేసి మెయిన్‌ ఆర్గనైజర్‌ దేవినేని చక్రవర్తి, సబ్‌ బుకీ హరీష్‌లతో పాటు ముగ్గురు పంటర్లు చెన్‌రెడ్డి సురేశ్‌ రెడ్డి, సామ జైపాల్‌ రెడ్డి, షేక్‌ ఆసిఫ్‌ పాషాలను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.1,20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అప్పల రాజు, శ్రీనివాస్‌ ఉదయ్‌ కుమార్‌ పరారీలో ఉన్నారు. 

(చదవండి: లాఠీ లాక్కుని మరీ పోలీసునే చితక్కొట్టిన ఘనుడు...వైరల్‌ వీడియో)

మరిన్ని వార్తలు