దొంగల ముఠా.. దోచేయడంలో కన్‌ఫ్యూజ్‌ చేసి..!

13 Aug, 2021 15:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: మహారాష్ట్రలోని ఓ దొంగల ముఠా బస్పులు, రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దోచేస్తోంది. ఈ బ్యాగ్‌ స్నాచర్ల ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిని మహేంద్ర మోరే (45), మనోజ్ మేధే (33), అమిన్ షేక్ (49), శశికాంత్ కొల్వాల్కర్ (63), విజయ్‌కుమార్ గుప్తా (38), మనీష్ దర్జీ (34), శైతాన్సింగ్ రాజ్‌పుత్ (38) గా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 19న, ముంబైలోని రద్దీగా ఉండే బస్సులో ఓ నగల వ్యాపారి ఉద్యోగి నుంచి రూ.46.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. అయితే అతను చుటుపక్కల వారిని అప్రమత్తం చేయడానికి ప్రత్నించడంతో.. ఆ ముఠాలోని మరికొందరు అతడిని కలవరపెట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన సబర్బన్ అంధేరీ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.

నిందితుల్లో కొంతమందిని గుర్తించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. వారిని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దులో పట్టుకున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ముఠాను గుర్తించడానికి ఓ పోలీసు బృందం రాజస్థాన్‌లో కూడా పర్యటించిందని అధికారి తెలిపారు. కాగా నిందితుల్లో ఆరుగురు ముంబైకి చెందినవారు కాగా, ఒకరు రాజస్థాన్‌కు చెందిన వారు అని ఆయన చెప్పారు. వారి నుంచి రూ.24.28 లక్షల విలువైన 475 గ్రాముల బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ (జోన్ 10) మహేశ్వర్ రెడ్డి అన్నారు.  
 

మరిన్ని వార్తలు