వెలుగు చూస్తున్న ‘మార్గదర్శి’ అక్రమాలు.. నలుగురు అరెస్ట్

12 Mar, 2023 19:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఈనాడు రామోజీ­రావుకు చెందిన మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇండివిడ్యువల్‌ గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్‌ సమర్పించలేదు. బ్యాలెన్స్‌షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి ఇవ్వలేదు. తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలూ బేఖాతరు చేసింది.

దీంతో గడచిన మూడు నెలలుగా 444 గ్రూపులకు సంబంధించి కార్యకలాపాలను అధికారులు నిలిపేశారు. డిసెంబర్‌ నుంచి కూడా ఈ ఫారం నింపి మార్గదర్శి ఇవ్వలేదు. అధికారుల చర్యలతో సంబంధిత బ్రాంచ్‌ల్లో చిట్స్‌ బంద్‌ అయ్యాయి.

మార్గదర్శి కేసులో నలుగురిని సీఐడీ అరెస్ట్‌ చేసింది. నలుగురు ఫోర్‌మెన్లను అదుపులోకి తీసుకుంది. నిన్నటి నుంచి మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీఐడీ.. విశాఖపట్నం మార్గదర్శి బ్రాంచ్‌ ఫోర్‌ మెన్‌ కామినేని రామకృష్ణ, రాజమండ్రి మార్గదర్శి బ్రాంచ్ ఫోర్ మెన్ సత్తి రవి శంకర్, విజయవాడ మార్గదర్శి ఫోర్ మెన్ బి.శ్రీనివాసరావు, గుంటూరు మార్గదర్శి ఫోర్ మెన్ గొరిజవోలు శివరామకృష్ణలను సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

మార్గదర్శి చిట్ ఫండ్ సోదాల్లో భారీ అక్రమాలు, ఉల్లంఘనలను సీఐడీ గుర్తించింది. మార్గదర్శిలో రికార్డులన్నీ అక్రమం అని, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని సీఐడీ గుర్తించింది. అక్రమాలకు పాల్పడినందున నలుగురు ఫోర్ మెన్లను సీఐడీ అరెస్ట్ చేసింది.. అరెస్టయిన నలుగురిని కోర్టులో  ప్రవేశపెట్టనున్నారు. 

కాగా,చట్టాన్ని యథేచ్చగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆ సంస్థపై సీఐడీ అధికారులు శనివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ, రామోజీరావు పెద్ద కోడలు చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

వారిపై సెక్షన్లు 120(బి), 409, 420, 477(ఎ) రెడ్‌విత్‌ 34 సీఆర్‌సీపీ కింద కేసు నమోదు చేశారు. ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం–1999, చిట్‌ ఫండ్‌ చట్టం–1982 కింద కూడా కేసు నమోదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

చదవండి: తోడు దొంగలు.. యథేచ్ఛగా అక్రమాలు, ఆర్బీఐ నిబంధనలు బేఖాతరు

మరిన్ని వార్తలు